Thursday, December 31, 2009

ఈ మధ్య చదివిన పుస్తకాలు

1) బడి నేర్పిన పాఠాలు: పిల్లలకు పాఠాలు నేర్పుతూ తాము నేర్చుకున్న పాఠాలేమిటి? ఆంధ్రజ్యోతి-ఎమెస్కో వారు కలిసి నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో ఎంపికైన వ్యాసాల సంకలనం. పుస్తకం చదువుతుంటే మన పాఠశాలల దయనీయ స్థితులను తలచుకొని నిర్వేదం, మనం అడుగిడేది 2010లోకేనా అన్న అపనమ్మకం, స్ఫూరి నిచ్చే కొన్ని వ్యక్తిత్వాలను చూసి ఇంకా హోప్ ఉందన్న భావం కలగలిసిపోతాయి. ఒట్టు-అన్న వ్యాసం చదివాక కళ్ళు చెమ్మగిల్లని వారుండరు. గిజుభాయి సూత్రాలను ఆచరిస్తున్న మరో కిశోరభారతి, సౌజన్యా ఎడ్యుకేషనల్ అకాడమీ గురించి మనమందరం తెలుసుకోవాలి. ఈ పుస్తకం concept గొప్పగా ఉన్నా చదువుతుంటే this could have been better in so many ways అనిపించింది. ఉదాహరణకి వ్యాసాలు చదువుతుంటే బోలెడు ప్రశ్నలు రేకెత్తుతుంటాఇ. ఆయా టీచర్లతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి, స్కూళ్ళ ఫోటోలు కొన్ని ప్రచురిస్తే బాగుండేది. ఇంత చక్కని కాన్సెప్టుకు ఫాలో అప్ ఏమిటి? అన్న ప్రశ్నకూడా మదిని తొలుస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా తప్పక చదవాల్సిన పుస్తకం.
(ఎమెస్కో ప్రచురణలు, వెల 50/-)

2) కథా కేరళం : తకళి శివశంకరపిళ్ళై నవల "చెమ్మీన్" అనువాదం "రొయ్యలు" చదివినప్పటినుండి ఆయన పుస్తకాలు ఇంకేవైనా చదవాలని అనుకున్నాను. బుక్‌ఫెస్ట్‌లో ఈ కథల అనువాదం చూసి వెంటనే కొన్నాను. ఒక తరం కేరళ కథకుల కథలు సంకలించి అనువదించిన పుస్తకం. మలయాళ కథా సాహిత్యానికి పరిచయదీపిక లాంటిది. పదిహేను కథల సంకలనం. ఎక్కువభాగం మంచి కథలే. కథా సాహిత్యంలో ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చదవాలి. ఇక ఈ సంకలనంలో ఒకే ఒక యువ రచయిత కథ ఉంది. సమకాలీన సాహిత్యం ఎలా ఉందో తెలీదు కాని, ఇవి చదువుతుంటే మన తెలుగు కథ ఇంచుమించు ఇదే స్థాయిలో ఉందని అనిపించింది.
(వెల 75/- విశాలాంధ్ర/నవోదయల్లో దొరుకుతుందిట)

3) నిద్రితనగరం : వైదేహీ శశిధర్ కవితలగురించి బ్లాగ్లోకంలో ఆల్రెడీ రెండు-మూడు సమీక్షలు వచ్చాయి. పుస్తకం చదివిన తర్వాత సమీస్ఖకారులు మెచ్చుకున్నంత బావుందనిపించింది. ఈ నవతరం కవయిత్రులు ఇంద్రాణి, వైదేహి లను చదువుతుంటే కొట్టొచ్చినట్టు కనిపించే ఒక విషయం. ప్రకృతితో ఇంతగా మమేకమై కేవలం అమ్మాయిలే రాయగలరు. కవిత్వప్రేమికులు, భావుకులు చదవాల్సిన పుస్తకం. (వెల 50/- నవోదయలో, అజోవిభో ఆన్‌లైన్ షాపుల్లో దొరుకుతుంది.)

4) దేశదేశాల హైకు : పెన్నా శివరామక్రిష్ణ గారి అనువాదాలు. దేశదేశాల హైకులను ఒక్కచోట చేర్చి అనువదించిన పుస్తకం. ఈ పుస్తకం గురించి ఒక పరిచయం వ్యాసం మరెప్పుడైనా రాస్తాను. ప్రస్తుతానికి కొనుక్కోండి అనే నా సలహా. (వెల 30/- పాలపిట్ట ప్రచురణలు)

(బై ద వే, ఇవన్నీ నేను బుక్‌ఫెస్ట్‌లో పాలపిట్ట స్టాల్లో కొన్నవి. విజయవాడ వాస్తవ్యులు నాలుగుదిక్కుల తిరక్కండా మీ బుక్ ఫెస్ట్‌లో పాలపిట్ట స్టాల్లో కొనుక్కోవచ్చనుకుంటా.)

Tuesday, December 29, 2009

రోశయ్య చేసిన ఒకేఒక మంచి పని...

1) రోశయ్య చేసిన ఒకే ఒక్క మంచి పని:
ఏ క్షణాన రోశయ్య అధికారంలో వచ్చాడో కానీ ఒక్క రోజు కూడా అధికారాన్ని ఎంజాయ్ చేసినట్టనిపించదు. ఓ రెణ్ణెల్లు దాక జగన్ని ముఖ్యమంత్రి చేయాలంటూ కాంగ్రెస్ వాళ్ళే ఆయన్ని ఒప్పుకోలేదు. ఇటలీ మేడం రాయిని మనసు చేసుకొని ఇదింతే, మార్పులు చేర్పులకు వీల్లేదు అనేంతవరకూ కనీసం తన సీట్లో తనైనా చక్కగా కూర్చోలేకపోయాడు. సరే అనుకుంటే ఎన్నడూ లేనట్టుగా కృష్ణమ్మ కన్నెర్ర జేసింది. అంతూ దరీ లేకుండా వర్షాలు కురిసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాయి. అదీ సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు తెలంగాణ గొడవ మొదలయ్యి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇన్ని రోజుల్లో రోశయ్య చేసిన ఒకే ఒక మంచిపని ఏంటి తెలుసా? సచివాలయం నుండి మా ఇంటి వరకు ఒక్క గుంతైన లేని, గతుకులు లేని రోడ్డు వేయించాడు. అఫ్కోర్స్, మా ఇంటి పక్కనే వాళ్ళిల్లు ఉండడంతో ఆయనకూ సౌకర్యంగా ఉంటోందిట ;)

2) పిల్లలూ - పిడుగులు
స్కూల్లో క్రిస్మస్ ఈవెంట్ సందర్భంగా మీ "విభు"కి శాంటాక్లాస్ డ్రెస్ వేయండి అని వాళ్ళ ప్లేస్కూల్ టీచర్ రిక్వెస్టు పంపింది. సరే మాకూ సరదాగానే అనిపించి ఎక్కడినుండో ఒక యాభై రూపాయల విలువ చేసే శాంటా డ్రెస్సుని ఐదొందలు పెట్టి కొన్నాం. తెల్లని పత్తితో చేసిన మీసాలు గెడ్డాలు ఒకవైపు చికాకు పెడుతున్నా పాపం బుద్ధిగా వెళ్ళి స్కూల్లో చాక్లెట్లు పంచి ఇచ్చాడు. ఇరవయి మూడున ఇదయ్యాక చక్కగా మర్చిపోయాం.
ఇక క్రిస్మస్ రోజు సాయంత్రం బయటకు వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద ఫుల్ శాంటా గెటప్‌లో ఎవరో కుర్రాడు నిల్చున్నాడు. మొహానికి శాంటా మాస్కు కూడా తగిలించుకున్నాడు. కారాపి "విభుడూ అదిగో శాంటాని చూడు" అని వాడికి చూపిస్తున్నాను.శాంటా కుర్రాడేమో చేతులూపుతూ అనుకోని బుల్లి అతిథిని "హాయ్, హాపీ క్రిస్మస్" అనుకుంటూ పలుకరించాడు. ఒక నిమిషం పాటు మా వాడి కోల్డ్ రెస్పాన్స్ చూసి సరేలే అని కిటికీ మూసేసి ముందుకి కదిలాం. కిటికీ మూయగానే మా వాడాడిగిన మొదటి ప్రశ్న.
"ఆ డ్రెస్సు ఎవరు వేసుకున్నారు బాబాయ్?"

3) ఫెయిలైతే దుఖఃం, ఫస్టొస్తే...?
3 ఇడియట్స్ సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. మాధవన్, శర్మాన్ జోషి పరీక్షాఫలితాలు చూడ్డానికి వెళ్తారు. చిట్టచివర్న వాళ్ళిద్దరి పేర్లు ఉండడం గమనిస్తారు. ఆమిర్ఖాన్ పేరు కిందెక్కడా ఉండదు. మాధవన్ స్నేహితునికోసం తెగ బాధపడిపోతుంటాడు ఫెయిలయ్యాడేంటా అని. అప్పుడు శర్మాన్ వచ్చి వాడు ఫెయిలవలేదు ఫస్టొచ్చాడు అని చెపుతాడు. మాధవన్ సూత్రధారిగా ఒక విషయం చెబుతాడు. "స్నేహితుడు ఫెయిలైతే అరరే అని బాధపడుతాం కాని వాడట్టే శ్రమలేకుండా ఫస్టొచ్చాడంటే మాత్రం ఈర్ష్యగా ఉంటుంది అని." ఈ డైలాగ్ ఇంటికొచ్చాక ఎందుకో మళ్ళీ గుర్తొచ్చింది. ఎందుకురా అంటే తెలుగు సాహిత్యంలో ఇలాంటిదే ఒక సంఘటన గురించి చదివింది గుర్తొచ్చింది.
తెలుగులో సీరియస్ సాహిత్యానికి ఎంకరేజ్మెంటులేదనీ పుస్తకాలుకొనేవారు లేరని సాహిత్యకారులు అపుడపుడూ వాపోతుంటారు. కథకుడి పారితోషికం కనీసం వెయ్యికూడా ఉండదని కంప్లైంటు చేస్తుంటారు. అలాంటిది ఒకసారి తానా వారు ఒకసారి నవలలపోటీల్లో ఉత్తమనవలకి లక్ష రూపాయల బహుమానం ఇచ్చారు. అప్పుడు మెజారిటీ సాహిత్యకారులు లక్షరూపాయల బహుమానం వచ్చేంత ఏముందా నవలలో అని సన్నాయి నొక్కులు నొక్కుకున్నారుట. (బై ది వే, ఆ నవల పేరు 'రేగడి విత్తులు ' మన బ్లాగరు చంద్రలత గారి రచన. చాలా బాగుంటుంది. ఎపుడైనా వీలు కుదిరితే... కాదు కాదు.. ఎలాగైనా వీలు చేసుకొని చదవండి.)

Monday, December 28, 2009

ఒక సరదా సమీక్ష

ముప్ఫైఒకటిన సిటీలో ఏమైనా ప్రొగ్రాంస్ ఉన్నాయా అని www.fullhyd.com సైటు చూస్తున్నా. అదేమంత పేరుమోసిన సైటు కాదు కాని నాకు చాలామట్టుకు ఈవెంట్స్ వెతకడంలో సహాయపడింది. ఐతే ఇవాళానుకోకుండా హోం పేజిలో ఒక లైన్ నన్నాకట్టుకుంది.
"The first step towards enjoying kaasko is to skip the first half." అరె వా ఇంత నిర్మొహమాటంగా, సరదాగా సమీక్ష రాసిందెవరు అనిక్లిక్ చేసి చూద్దును కదా ఇక నవ్వుల ప్రవాహం ఆగలేదు. దీపా గరిమెళ్ళ అని ఎవరో అమ్మాయి ఈ సైటుకు సమీక్షలు రాస్తోంది.

ఉదాహరణకి కొన్ని స్నిప్పెట్స్:
1) The first step towards enjoying Kasko is to skip the first half. That's because nothing much happens before the interval. The second step is to then skip the second half.
2) Plus, she's being forced to marry Pradeep Rawat for this - because he felt that though there are many documented ways to give birth to a person, the most sure-shot way is to marry his father. At this point, some members of the audience were found starting fasts-unto-death, demanding a separate state for the writers of Kasko. Some others demanded for everyone to stay united, and continued with the movie - on a watch-unto-death mission.
3) All said and done, Kasko won't test your patience - they'll heave it out of the theatres pretty soon.

అన్ని సినిమాలు ఇలాగే రాస్తుందా లేక ఈ సినిమా నిజంగా చండాలంగా ఉందా అని బాగా పాపులర్ అవుతున్న 3-ఇడియట్స్ సమీక్ష చదివా. చక్కగా బాలన్స్‌డ్ గా రాసిన సమీక్ష. నిజానికి 3-ఇడియట్స్ సినిమా నాకు బాగా నచ్చింది. రీడిఫ్ రివ్యూలను ఖండిచాలన్న కోపంతో గబా గబా రాశానే కాని సినిమాలో నెగటివ్స్ గురించి చెప్పలేదు.

మరోసారి సినిమా చూడాలా వొద్దా అనుకున్నప్పుడు ఈ అమ్మాయి సమీక్ష శుభ్రంగా ఫాలో అవ్వొచ్చనుకుంటా. lol.

PS. అనుమతి లేకుండా ఆ ఆర్టికల్ స్నిపెట్స్ కోట్ చేశాను. సరదా సమీక్ష అందరికీ పరిచయం చేయడమే కాని వేరే దురుద్దేశం లేదు.

Friday, December 25, 2009

3 ఇడియట్స్ - ఫ్రెష్ అవుటాఫ్ అవెన్

అవతార్ సినిమా టికెట్లకోసం "బుక్ మై షో"లో పచార్లు చేస్తుంటే ఉన్నట్టుండి 3 ఇడియట్స్ టికెట్స్ కనిపించాయి. ఫస్ట్ డే, ఫస్ట్ షో టికెట్స్. హిందీసినిమా ఫస్ట్డే ఫస్ట్ షో అవసరమా అని ఒకవైపు పీకుతున్నా అమీర్‌ఖాన్ ఉన్నాడన్న ధైర్యంతో కొనేశాను. తీరా రీడిఫ్‌లో రెండు సమీక్షలు చదివితే యావరేజ్ సినిమా అని రాశారు.

ఈ సినిమా చేతన్ భగత్ రాసిన కల్ట్ నవల five point someone ఆధారంగా నిర్మించబడిందని ఎప్పటినుండో చదువుతున్నాను. ఫైవ్ పాయింట్ సంవన్ ని యధాతథంగా తీస్తే గొప్ప సినిమా అవుతుందా? అందులో అన్ని సబ్‌ప్లాట్స్ ఉన్నాయా? అని అనుకున్నాను. 3 ఇడియట్స్ ఫైవ్ పాయింట్ సంవన్ ను యధాతథంగా తీసింది కాదు. ముఖ్యపాత్రలు, కాలేజ్ సెట్టింగ్ అందులోంచి తీసుకొని దానికి కొంచెం good will hunting లాంటి బాగ్రౌండ్ కలిపి, ఇంకొంచెం patch aaDaMs మసాల కలిపి కొంచెం ఒరిజినాలిటీ కూడా కలిపితే 3 ఇడియట్స్.

కథ ఒక ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగు కాలేజిలో నడుస్తుంది. ఆమిర్, మాధవన్, షర్మాన్ హాస్టల్లో రూమ్మేట్స్. బోలెడు కుటుంబభారాలు, ఆశలు మోస్తూ షర్మాన్ వస్తే తండ్రి బలవంతం మీద ఇష్టం లేకున్నా ఇంజనీరింగుకి వస్తాడు మాధవన్. ఆమిర్ అలాకాదు, తనకి మెకానికల్ ఇంజనీరింగంటే ప్రాణం. కష్టపడ్డం బదులు ఇష్టపడి చదవడం వల్ల అన్నిట్లో ముందుంటాడు. అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే ఆమిర్ వెనక ఒక షాకింగ్ నిజం ఉంటుంది. పొరలు పొరలుగా ఆ నిజాన్ని విప్పుతూ బోలెడు నవ్వులు పండిస్తూ మంచి ఎంటర్‌టైనర్ని తయారుహేశాడు డైరెక్టర్. కొన్ని జోకులు మాత్రం ఇంటర్‌నెట్లో బాగా నలిగిన జోకులు. ముగ్గురు హీరోల్లో మాధవన్ కొంచెం అండర్-యుటిలైజ్డ్. మిగిలిన పాత్రల్లో బొమన్ ఇరాని, కరీనా, చతుర్ రామలింగం క్యారక్టర్ బాగా చేశారు.

రాజూ హీరాని ఇంకా పాచ్ ఆడంస్ మాజిక్ నుండి బయటపడ్డట్టు లేదు. మున్నాభాయిMBBS లో చాలా సీన్లు వాడుకున్నాడు. మిగిలిన కాలేజి సీన్లు, డీన్‌తో ఫైట్ సీన్లు ఈ సినిమాలో పెట్టేసుకున్నాడు. చాలా సార్లు పుస్తకం ఆధారిత సినిమాలు చూసి మనం నిరాశ పడిపోతాం. కాని ఈ సినిమా పుస్తకంలో కేవలం సెట్టింగ్ అండ్ ప్లాట్స్ తీసుకున్నా డెఫినిట్‌గా ఇది అంతకంటే మంచి కథనే ప్రజంట్ చేశాడు.

నవతరంగంలో ఎవరో ఒకరు మంచి రివ్యూ ఎలాగూ ఇస్తారు. ప్రస్తుతానికైతే అదొక పైసా వసూల్ సినిమా అని, లగే రహో మున్నాభై లాగే మంచి ఎంటర్‌టైనర్ అని, రీడిఫ్ లో ఆ 2 ఇడియట్స్ రాసిన రివ్యూలని పట్టించుకోకుండా చక్కగా వెళ్ళి సినిమా చూడంది.

Monday, December 21, 2009

బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు

బుక్ ఫెస్టివల్ - పిల్లల పుస్తకాలు

బుక్ ఫెస్టివల్‌కు జనరల్‌గా రెండు ట్రిప్పులేస్తాను. ఓసారి తెలుగు పుస్తకాలు కొనుక్కోడానికీ, ఓసారి ఇంగ్లీషు పుస్తకాలు కొనుక్కోడానికి. ఈ టపాలో పిల్లలపుస్తకాలగురించి నా అనుభవాలు రాస్తాను. నాక్కావలసింది, ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి తెలుగు పుస్తకాలు.
ఒకటి నుండి ఐదేళ్ళ పిల్లలకి చదవడమే రాదు వాళ్ళకి పుస్తకాలేమిటా అని అడక్కండి. ఆరునెల్ల వయసునుండే మనం పిల్లలకి పుస్తకాలు చదివి వినిపించొచ్చు. మొదట మనం పేజీకి ఒకే బొమ్మ ఉండే ఆపిల్, ఆరెంజ్ లాంటి పుస్తకాలతో ప్రారంభించాలి. ఒక్కొక్క పదం రిపీట్ చేస్తూ ఎంత నెమ్మదిగా చదివించినా పదినిమిషాలకంటే ఎక్కువ సమయం పట్టదు. ఆ తరువాత ఒక పేజీలో ఏదైనా ఆక్టివిటీ ఉండే పుస్తకాలు చదవడం మొదలెట్టాలి. (ఉదాహరణకి తోటమాలి మొక్కలకి నీళ్ళు పోయడం), 3-6 ఆరు నెలల్లో పిల్లలూ ఆ స్థాయి దాటేస్తారు. అప్పుడు మనం కాస్త కామిక్స్, అమర్ చిత్ర కథలాంటివి చదవొచ్చు వాళ్ళకి. ఇవన్నీ ఇంత సాధికారికంగా చెప్పడానికి నాకేమీ సైకాలజీ డిగ్రీల్లేవూ అలా అని నేను కనీసం పేరెంట్ ని కూడా కాదు. కాని అక్క/అన్నల పిల్లల మీద ఈపాటికే ప్రయోగాలు చేసి కరెష్టే అని తీర్మానించుకున్నాను.

మా ఇంట్లో ఓ మూడేళ్ళ బు(పి)డుగు. వాడికి టీవీ అట్టే చూపించొద్దని చాలా చిన్నప్పుడే వాళ్ళమ్మా నాన్న డిసైడ్ చేయడంతో దాంట్లో వాడికి పెద్ద అభిరుచి లేదు. వాడికి ఏడాది/ఏడాదిన్నర వయసున్నప్పుడు బొమ్మల కథలున్న పుస్తకాలు ముందేసి వాడికి చెబుతుంటే వాడి తిండి తినే ప్రసహనం గంటన్నర నుండి సగానికి కుదించవచ్చని, పాలు తాగే ప్రసహనం ముప్ఫై నుండి పది నిమిషాలకు కుదించవచని ఒక దేవరహస్యం తెలిసింది. ఇక అప్పుడు మొదలయ్యింది పిల్లలపుస్తకాల వేట. ఇక్కడ వాడి వయసు 1.5-3 కి మధ్య కాబట్టి వాడు స్వతహాగ చదవలేడు. అలాగే ఒక పేజీలో రెండు కంటే మించి బొమ్మలుంటే వాడికి నచ్చదు. మరి అలాంటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?

విశాలాంధ్రలో/నవోదయల్లో చూడ్డం శుద్ధ దండగ. అక్కడ పిల్లల పుస్తకాలు 2-5% ఉంటాయి. అవీ తమంతట తామే తెలుగు చదువుకోగలిగే పిల్లల కోసం. ఇక Walden/AA Hussain వంటి ఇంగ్లీషు పుస్తకాల షాపుల్లో బోల్డు దేశీయ ప్రచురణలుంటాయి. అవన్ని misguided missiles లాగా ఉంటాయి. అసలు పిల్లల అభిరుచి గురించి వాళ్ళకి కాస్తైన జ్ఞానం ఉన్నట్టనిపించదు. ఒక టెక్ ఉపమానం ఇవాలంటే, బోల్డు ఇన్‌ఫర్మేషన్ పెట్టుకొని యూజర్ ఇంటర్ఫేస్ సరిగా లేని వెబ్‌సైట్లలా ఉంటాయి. ముందే చెప్పినట్టు అంత చిన్న పిల్లలకి ఒక పేజీలో ఒకటికన్నా ఎక్కువ బొమ్మలుండడం నచ్చదు. వాళ్ళ దృష్టి పరిపరి విధాలుగా పోతుంది. చివరికి నాకు దొరికినవి విదేశీ ప్రచురణలు. చక్కటి పిల్లల పుస్తకాలుంటాయి ఇంగ్లీషులో. పిల్లల్ని ఇట్టే ఆకట్టుకొనే కార్టూన్ కారక్టర్స్ గట్రా. కానీ వీటితో ఒక పెద్ద చిక్కుంది. ఒకటి - అవి ఇంగ్లీషులో ఉంటాయి. అదేం పెద్ద కష్టం కాదు, కథ పూర్తిగా మనం చదివేసి వాళ్ళకి తెలుగులో చెబితే సరిపోతుందనుకుంటే, అవి చెప్పే కథలు కూడా ఏ డిస్నీ కారక్టర్సో, ఫెయిరీ ప్రిన్సెస్‌ల గురించో ఉంటాయి. పేర్లు కూడా జాన్, టాం బార్బీ ఇవి. మాటలు నేర్చుకునే వయసులో వాళ్ళకు వాళ్ళ చుట్టూ ఉన్న పేర్లు కాక వేరే అరువు పేర్లు వినిపించడం ఎంత సబబు? మనకు బోల్డన్ని పంచతంత్రాలు, రామాయణ భాగవతాలుండగా మనకూ తెలియని, మనం రిలేట్ చేసుకోలేని డిస్నీ కథలెందుకు చెప్పాలి?

ఇలాంటి సమయంలో నాకు 2007 బుక్ ఫెస్టివల్లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ బెంగళూరు వాళ్ళ స్టాలు కనిపించింది. చిల్డ్రన్స్ బుక్ ట్రస్టు వాళ్ళు చక్కగా మన భారతీయ నేటివిటీ ఉన్న కథలు పేజీకొక బొమ్మ/ ఆక్టివిటీ ఇలస్ట్రేషన్లతో ఒకే లైన్ టెక్స్ట్ తో కొన్ని పుస్తకాలు ముద్రించారు. పోలోమని బోల్డు కొనేసుకున్నా.. అందులో ఉదాహరణకి ఒక కథ చెబుతాను. ఒక చిన్న పక్షి ఉంటుంది. ఓ రోజు నోట్లో గింజ పెట్టుకొని తింటుంటే గింజ కాస్త పడి మట్టిలో కూరుకుపోతుంది. ఆ పక్షి రోజూ అక్కడికి వచ్చి వెతుకుతుంటే ఓ రోజు అక్కడ ఒక మొక్క కనిపిస్తుంది. ఇలా... ఇంకొన్ని సబ్జెక్ట్స్, మీతా అండ్ హర్ మాజిక్ షూస్, మోహినీ భస్మాసుర, దీపావళి పండగ( మావాడికి ఇదెంత ఇష్టమో) etc... ఇవి ఇంగ్లీషులోనే ఉన్నా మన నేటివిటీకి దగ్గరగా ఉండి కొంతలో కొంత మేలనిపించాయి. అదే ఏడు తార్నాక నుండి ప్రచురితమయ్యే "మంచిపుస్తకం" ప్రచురణలు కూడా చూశాను. కానీ వాళ్ళవి ఇంకా బాల్యదశలోనే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలతో పిల్లల్ని ఏమాత్రం ఆకట్టుకోకుండా ఉన్నాయి. అలాగే ముట్టుకుంటే చిరిగిపోయేట్టు. ఆ వయసు పిల్లలనుండి మనం డెలికేట్ హాండ్లింగ్ ఆశిచంలేం కదా. 2008లో కూడా సేం స్టోరీ. తెలుగులో సరైన పుస్తకాలు లేవు. పిల్లల పుస్త్కాల్లో పేజీలు కాస్త మందంగా, త్వరగా చినిగిపోకండా ఉండాలి. CBT వాళ్ళూ, మంచిపుస్తకం వాళ్ళూ ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కాని రెండు కారణాల వల్ల దీన్ని క్షమించేయవచ్చు. 1) పిల్లలు ఒక కథని మహా అంటే రెణ్ణేల్లకు మించి చదవరు. అప్పటికి వారికది కంఠతా రావడమయి ఆ పుస్తకంతో పనిలేకుండా పోతుంది. పుస్తకం జీర్ణమైనా పెద్ద నష్టమేమీ ఉండదు. 2) దళసరి అట్టలు పెట్టి ముద్రిస్తే పుస్తకం ధర పెరిగిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి పుస్తకాల ధర్ ఇరవయి రూపాయలు. ఈ రోజుల్లో ఇది కారు చవక ధరంటాను. కాదంటారా? ప్రతీ సంవత్సరం నేను స్టాల్ ఓనర్లతో నేరుగా మాట్లాడి వాళ్ళకి ఫీడ్‌బాక్ ఇచ్చాను. అదీ పూర్వరంగం.

ఈ సంవత్సరం 2009 ఫెస్టివల్లో తిరుగుతూ తిరుగుతూ "మంచిపుస్తకం" వాళ్ళ స్టాల్‌కి వెళ్ళి చూద్దును కదా నేకోరుకున్న పిల్లల పుస్తకాలన్నీ అచ్చ తెలుగులో. ఎంత ఆనందమేసిందో. చక్కని తెలుగులో చిన్న చిన్న పిల్లల పుస్తకాలు. ఒక్కోటీ పది-పదదహారు పేజీల పుస్తకాలు. ధర ఇరవయి రూపాయలతో అందుబాటులోనే ఉంది. ఎడా పెడా కొనేశాను.

అఫ్కోర్స్ మా వాడికి కాదు. వాడు రెండేళ్ళుగా ఇలాంటివి చదివించుకొనీ చదివించుకొనీ వివిధదశలు దాటిపోయాడు. ప్రస్తుతం ఒక మెట్టెక్కి అమర్-చిత్ర కథ సిరీస్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. రామాయణ, భారత భగవతాలు తెగ విని బాగా ముదిరిపోయీ మొన్నీ మధ్యే ప్లేస్కూల్లో టీచర్లపై ఆగ్నేయాస్త్రం వేస్తానని, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే బ్రహాస్త్రం వేసి గదతో కొడతానని బెదిరించాడట. సో మావాడికీ యేడు బొమ్మలు తగ్గిపోయి ఒక్కో పేరాగ్రాఫున్న పుస్తకాలు కొన్నాను. చూడాలి వాడు ఎలా రియాక్టవుతాడో.

మీరు కూడా ఈ సంవత్సరం బుక్ ఫెస్టివల్ కి వెళ్తే రెండు స్టాల్స్ చూడ్డం మరవొద్దు. 1) చిల్డ్రన్స్ బూక్ ట్రస్టు వాళ్ళది 2) మంచిపుస్తకం వాళ్ళదీ. నాకు వీళ్ళతో ఎటువంటీ లావాదేవీలు లేవు సుమీ. పిల్లలు మీవాళ్ళైనా, మీ బంధుమిత్రగణంలో వాళ్ళైనా మనం పదిమందికి పుస్తకాలు బహుమానమిస్తే కనీసం ఒక్కరికి పుస్తకాలు చదివే అలవాటు అబ్బినా అవన్నీ సార్థకమయినట్టే. ఇంకోసారి పిల్లలున్న ఇంటికి వెళ్ళేప్పుడు ఇరవయి రూపాయలు పెట్టి డైరీమిల్క్ చాక్లెట్లు కొనేకన్నా ఇలాంటి పుస్తకమొకటి ఇచ్చి చూడండి.

ఇక నా విష్‌లిస్టులో తరువాతి ఐటం. అమర్‌చిత్రకథ లాంటి సిరీస్‌లు తెలుగులో కావాలి. తెలుగు ప్రచురణకర్తలూ వింటున్నారా?

అలాగే ఈ బుక్‌ఫెస్టివల్ కి నాదో విష్ లిస్టు. ఒక ఎలక్ట్రానికి స్క్రోల్ ఏర్పరచి ఉన్న రేర్/మంచి పుస్తకాల పేర్లు/రచయితలు అవి దొరికే స్టాల్స్ లిస్టు ఇవ్వొచ్చు. అప్పుడు చాలా మందికి ఎక్కువ తిరక్కుండా టీవీ ముందు కూర్చొని పుస్తకాలు కొనేసుకోవచ్చు. ఏమంటారు.

Sunday, December 13, 2009

వాద్య - సాజ్ - మ్యూజిక్ టుడే రీ-ప్యాక్స్

ఈ కాలం గుడికి వెళ్తే దేవుడి కన్నా ముందు దర్శించాల్సింది చెప్పుల స్టాండుని. మొన్నీ మధ్య గుడికి వెళ్ళి చెప్పుల స్టాండు దగ్గరకు వెళ్ళగానే పొందికగా పెట్టి కనిపించాయి ఆ అల్బంస్. మ్యూజిక్ టుడే వాళ్ళు శాస్త్రీయ కళాకారులతో రికార్డ్ చేసి రిలీజ్ చేసే మేస్ట్రో సిరీస్ సీడీలు. పెళ్ళికూతురిలా అలంకరించుకొని మాంచి బైండింగ్ వర్కుతో అట్టహాసంగా ఉంది. ఒకటి కర్నాటక సంగీత వాద్యకారుల కలెక్షను. పేరు - వాద్య. టీ.ఎన్.క్రిష్ణన్ వాయులీనం, కదిరి సాక్సోఫోన్, మాందలిన్ శ్రీనివాసు, చిత్రవీణ రవికిరణ్, ఎన్.రమణి ఫ్లూట్ ఇంకో మూడు నాకట్టే తెలీని ఆర్టిస్టులు.మొత్తం ఎనిమిది సీడీల కలెక్షన్. ఒకసారి వావ్ అనుకొని ధర చూస్తే ఎం.ఆర్.పి. రెండు వేల రూపాయలు. శాస్త్రీయ సంగీతంలో ఓ అంటే నా రాదు నీకింత అవసరమా అని నాలో డెవిల్, ఇది కొనకుంటే పర్లేదు కానీ మళ్ళీ ఎవరితోనైన కర్నాటక సంగీతం అంటూ మాట్లాడితే చంపేస్తాను అని ఏంజిలు రెండు వైపులా లాగుతున్నారు (ఏంజిల్స్ కూడా చంపుతారా?) . చులాగ్గా నవ్వుతూ వచ్చాడు సేల్స్‌మన్ (బుట్టలో పడిందిరా పిట్ట అనుకుంటూ..). నేను ఏదో క్యాజువల్గా ఉన్నట్టు నటిస్తున్నా కానీ పప్పులేం ఉడకట్లేదు. అది చూడగానే కళ్ళు వెలిగిపోవడం దూరంగా కూర్చొని చూసాడు కాబోలు.

ఏంటివి? చెప్పులస్టాండు దగ్గర?
క్లాసికల్ మ్యూజిక్ సీడీలు సిర్. బాగుంటాయి.
ఓహో.
ఇండియా టుడే వాళ్ళవి సార్. చాలా బాగుంటాయి. ఇప్పటికే బోలెడు డాక్టర్లు, ఎజుకేటెడ్ పీపుల్ కొనుక్కెళ్ళారు. (ఐతే ఏంటటా..?) డిస్కౌంట్ సేల్ కింద 2000 రూపీస్ వి 500 కి అమ్ముతున్నాం.
(..ఏంటీ?? మళ్ళీ చెప్పు....)
ఫైవ్ హండ్రెడా? బయట కొంటే ఒక్కోటి 250 ఉంటయి సార్. ఎం.ఆర్.పి చూడండి. (తెలుసు లేవో..)

కొందామని ఎలాగూ డిసైడ్ అయ్యాను కానీ ఆ చెప్పుల స్టాండు వాతావరణం వాడి వాలకం చూస్తుంటే కొంపతీసి డుప్లికేట్ సీడీలో ఖాళీ సీడీలో అమ్మట్లేదు కదా అని అనుమానం. కాసేపు అవీ ఇవీ మాట్లాడి కంఫాం చేసుకొని కొనుక్కున్నా. ఆఫ్కోర్స్, నా కంఫైర్మేషన్ ఇంటికొచ్చాక రీ కంఫాం అయ్యింది.

విషయమేంటంటే డిరెక్ట్ మార్కెటర్స్ వాళ్ళు ఇలా మ్యూజిక్ టుడే వాళ్ళ పాత సరుకును తీసుకొని అందంగా ముస్తాబు చేసి మళ్ళీ అమ్ముతున్నారు.

సేల్ మొత్తమయ్యాక నిదానంగా హిందుస్తానీ సిరీస్ తీసి చూపించాడు. పేరు - సాజ్. అందులో ఐతే ఆర్టిస్టులు నాకు తెలిసినవాళ్ళే. గొప్ప గొప్ప పేర్లు. జాకీర్ హుస్సేన్ తబ్ల, రవిశంకర్ సితార్, అంజాద్ అలి ఖాన్ సరోద్, రాం నారాయణ్ సారంగి. అబ్బో. ఇది ఇంకా బాగుంది. పదహారు సీడీలు. 1200/- సేల్ ధర. మా తబ్లా సార్ పుణ్యమా అని ఈ మధ్య హిందుస్తానీ కూడా వింతున్నాను. అదీ కొందామనిపించింది కానీ అందులో ఆరు నా పర్సనల్ కలెక్షన్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక్కొక్కటీ అమ్మం సార్ అని శుభ్రంగా చెప్పాడు. సర్లే అని లైట్ తీసుకొని వచ్చేశా.

ఇదంతా అయిన వారం రోజులకు మొన్న మా సారు క్లాసులో, "నా దగ్గిర కొన్ని సీడీలు ఉన్నాయి. ఆ కంప్యూటర్లూ అవీ నాకు సరిగా తెలీవు. మా అబ్బాయి కొనిచ్చిన కొత్త ఐ-పాడ్ లో ఆ సీడీలు కాపీ చేసి ఇస్తావా" అని అడిగారు. "నో ప్రాబ్లం సార్" అని ఒప్పేసుకున్నా.
ఇవాళ క్లాసుకెళ్ళి చూద్దును కదా, సార్ దగ్గిర ఉన్నాయి రెండు కలెక్షన్స్. నేనారోజు కొనకుండా వదిలేసిన "సాజ్" కలెక్సన్, అలాంటిదే మ్యూజిక్టుడే వాళ్ళది మరో పదహారు సీడీల కలెక్షను.

హహ్హాహ్హా..అప్పుడు తెలిసొచ్చింది తంతే పొయి గార్ల బుట్టలో పడ్డమంటే ఏంటో.

Saturday, December 05, 2009

కవిత్వంపై ఆసక్తి ఉంటే

కవిత్వంపై ఆసక్తి ఉంటే ఒకసారి ఈ ఉత్తరం చదవండి.

బాబూ,

ఈ పరిస్థితి తాత్కాలికం. క్రమక్రమంగా వికలమైన వాతావరణం ప్రశాంతమౌతుంది. ప్రకృతిలో పరివర్తన అనూహ్యం. మబ్బు కురిసినప్పుడే కురిసి అంతలోనే దూదిపింజల్లా తేలిపోతుంది. గాలి వీచినట్టే వీచి అదేమిటో హఠాత్తుగా స్తంభించిపోతుంది. ఎర్రగా పొడిచే పొద్దు ఒక్కొక్కమాటు కమిరిపోయినట్టు కనిపిస్తుంది. పరిసరాల్లో జరిగే దుష్పరిణామాలకు ప్రత్యక్షసాక్షి మనిషి. అన్నిటినీ చూసేది తానే. అన్నిటిని అనుభవించేది తానే. మంచిని గాఢంగా హత్తుకుంటూ చెడును కాలి గొనగోటితో చిమ్మేసుకుంటూ కాలం మూపు మీద స్వారీ చేస్తూ స్వచ్చందంగా పురోగమించినప్పుడే మనిషి మనుగడ సార్థకమవుతుంది.

ఇట్లు,
మీ నాన్న.

ఉత్తరం బావుందా? కష్టాల్లో ఉన్న మనిషికి స్వాంతన చేకూర్చే వచనాలు కదూ. నాకైతే ఫరవాలేదనిపించింది.

దీనికి కవిత్వానికి ఏమిటి సంబంధం అంటారా?

నవంబరు 30న ఆంధ్రజ్యోతి వివిధలో ప్రచురితమయిన ఒక కవిత చదువుతున్నాను. ఏమిటిది? కవితా? లేకపోతే పర్సనాలిటీ డెవెలప్మెంట్ క్లాసా అని అనుమానం వచ్చింది. ఆ కవితలో సింహభాగాన్ని యధాతథంగా తీసుకొని దానికి 1)బాబూ 2) ఇట్లు మీ నాన్న అని రెండు పదాలు కలిపాను అంతే. ఇది రాసింది ఒక ఘనత వహించిన గోప్ప కవి. తెలుసుకోవాలంటే నవంబరు 30 న వివిధ తిరగేసి "దుష్పరిణామాలు" కవిత చదవండి.

ఇప్పుడు చెప్పండి ఇది కవిత్వమా?

Friday, December 04, 2009

అనగనగా ఒక మొన్న

చాలామందికి (నాక్కూడా) ఆడవాళ్ళకు డ్రైవింగ్ - డైరెక్షన్ సెన్స్ సరిగా ఉండదని, మగవాళ్ళు ఆడవాళ్ళంత బాగా మల్టి-టాస్కింగ్ చేయలేరని నమ్మకం. (ఓకే ఓకే ఈ జనరలైజేషన్ కు ఏ బేసిస్ లేదు. కావున కామెంట్లతో హోరెత్తించకండి). అదే కాదు నాకు డ్రైవింగ్ స్కిల్స్ మీదా, డిరెక్షన్ సెన్స్ మీదా ప్రగా...ఢ నమ్మకం. దానికితోడు, నేనే గ్రూప్‌లో ఉన్నా డైరెక్షన్స్ నన్నే అడుగుతూ ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు బంధుమిత్రగణం. కాని మొన్న మాత్రం నాకు మాంచి గుణపాఠమయ్యింది.
చెప్పాను కదా తబ్లా కచేరీకని వెళ్ళి జస్రాజ్ మాయలో పడి పన్నెండున్నర వరకు చౌమొహల్లా పాలస్‌లో ఉండిపోయానని. వేళ్ళేప్పుడే నాకు కాస్త చిరాకేసింది. ఇంత మెయిన్ రోడ్లు పట్టుకు తిరగాలా షార్ట్ కట్ లో వెళ్తే బాగుండు అని. సరే ఇక తిరుగు ప్రయాణం లో వచ్చిన దారి కాదని ఓ నాలుగు కార్లు అఫ్జల్‌గంజ్ వైపు వెళ్తుంటే వాటిని ఫాలో అయ్యా. ఓ రెండు కిలోమీటర్ల దూరం నాకు పైలట్ వాహనాల్లా వచ్చి అటొకటి ఇటొకటి మలుపులు తీసుకున్నాయి. ఫాలో అవుదామంటే మరీ చిన్న గల్లీలు. సరే ఇప్పుడు వెళ్ళే రోడ్డు పెద్దదే గదా అని తిన్నగా వెళ్ళా కాసేపు. తిన్న్నగా వెళ్తే ఏ పురానపూలో, నయాపూలో వస్తుందనుకుంటే ఎంతకూ రాదే? సరే మూసేసిన దుకాణాల బోర్డులు చూస్తే అదేదో హుస్సేనీ ఆలం అని తెలిసింది. అయ్య బాబోయ్. ఎక్కడో ఓల్డ్ సిటీ గల్లీలో ఉన్నానని అర్థమయ్యింది. రాత్రి దాదపు ఒకటవుతోంది. ఒకటే చలి. నేను వేసుకున్నది హాఫ్ స్లీవ్స్ కాటన్ షర్టు. ఐసింగ్ ఆన్ ది కేక్ లా బండి రిజర్వ్లో పడి అప్పటికే ఓ యాభై కిలోమీటర్లయ్యింది. (బంద్ అని బంకుల దగ్గర క్యూలు ఉంటే నేను బద్ధకించా రిటర్న్‌లో ఎక్కడో పోయించవచ్చులే అని).

ఇక చూసుకోండి. లేని పోని ఊహలన్నీ వస్తున్నాయి. అంతలో GHMC రోడ్ బ్లాక్ కనిపించింది. అంతవరకు నాతో వచ్చిన బైకర్ రైట్ తీసుకుంటే సరే నేనూ రైట్ తీసుకున్నా. ఒక వందడుగులుపోగానే వాడు చక్కగా పార్క్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. నేను బిక్కమొగం వేసుకొని యూ టర్న్ తీసుకున్నా. అప్పటికీ నా సిక్స్త్ సెన్స్ ముందుకు సాగూ ఈ మాత్రం దానికి వెనక్కి తిరుగుతావా అని హేళన చేస్తోంది. మళ్ళీ మెయిన్ రోడ్ మీదకు రాగానే ఒకతను రోడ్ బ్లాక్ అవతలనుండి ఇవతలకి రావడం చూశా. హమ్మయ్య దొరికాడు.
"భాయ్ సాబ్, యే రస్తా కిధర్ జాత?"
"పురానా పూల్"
(హ హ..నా కాంఫిడెన్స్ మళ్ళీ పదిరెట్లయ్యింది.)
"గాడీ జా సక్తి క్యా?"
"థొడా సంభల్ కె జావో"
(ఓకే. గ్రీన్ లైట్)
శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ చీకట్లో కష్టపడి గుంతల్లోంచి బండిని అవతలికి తీసుకెళ్ళి కాస్త దూరం వెళ్ళగానే ఒక టూ వే మెయిన్ రోడ్.
యా...బేబీ..దేర్ యు గో. అనుకుంటూ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళాను. ఎంతకీ మూసీకి ఆవలి వైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ కనిపించదే? మళ్ళీ పప్పులో కాలేసానా? అనుకుంటూ అక్కడెవరో బైకర్ని అడిగా.
"యే రస్తా కిధర్ జాతీ?"
"షంషాబాద్"
ఓర్నాయనో అసలే పెట్రోల్ లేదంటే ఈ దారమ్మట వెళ్తే ఇంతే సంగతులు అనుకుంటూ మళ్ళీ యూ టర్న్.
తీరా చూస్తే నేనూ ఇంట్యూషన్ తో లెఫ్ట్ కొట్టా కానీ, ఒకసారి కనీసం రైట్ వైపు కన్నేసినా పురానాపూల్ ఎటో తెలిసేది. ఏమయింది నాకివాళ - డైరెక్షన్ సెన్స్ బొత్తిగా పనిచేయట్లేదు అనుకుంటూ ఒక ఆర్టీసి బస్సును ఫాలో అయ్యాను. దాదాపు పురానాపూల్ వరకు వెళ్ళాక తెగించి ఇంలిబన్ వరకు ఏం వెళ్తాం లే అని ఒక బ్రిడ్జ్ కనిపించగానే లెఫ్ట్ కొట్టేసా. బ్రిడ్జ్ ఆవలికి చేరితే అసలు అఫ్జల్ గంజే కనిపించదు..
ఓ షూట్. మళ్ళీ దారి తప్పానా? అని ఒక పెద్ద రోడ్డు కనిపించగానే తిన్నగా వెళ్ళా..
ఆ వీధంతా బేగంబజార్ టోకు సామానుల వాసన. హమ్మయ్య సరైన దార్లోనే ఉన్నా.. కాస్త తిన్నగా వెళ్ళి బేగంబజార్ రోడ్డెక్కితే చాలు అనుకొని వెళ్తున్నా.. ఎంతకీ మెయిన్ రోడ్ రాదె??
మరొకసారి జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం..దారి అడుగుదామంటే చింకిపోగులేసుకొని ఒక హోంలెస్ ఫెలో కనిపించాడు. వీణ్ణి కెలకాలా వద్దా అనుకుంటూ
"భాయ్ సాబ్, యే రస్తా కిధర్ జాతీ?"
ఆహ్?
"సీధ గయే తో కిధర్ జాతే"?
(ఇంతలో ఇంకొకడు అక్కడికి వచ్చాడు. వీడు వాడితో ఎందట ఈన గొడవ కొంచెం చెప్పురా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు).
ఓ షూట్. చక్కగా తెలుగులో అడిగా.
"నువ్వెక్కడికి బోవాలె?"
అప్పటికి అఫ్జల్గంజ్ దాటానని గెస్ చేసి నాంపల్లి అని చెప్పా.
"సీధబొయి లెఫ్ట్ తీసుకుంటే మొజంజాహి మార్కెట్. తెలుసుగద?"
"ఆ తెలుసు తెలుసు".
ఈ రోజు నాకేదో మూడిందని ఇంకోసారి రాత్రిపూట గల్లీల్లోకి దూరనని లెంపలేసుకుంటూ రజనీకాంత్ పాట పాడుకున్న.
"దేవుడా దేవుడా ..తిరుమల దేవుడా...ఉన్నావా ఉన్నావా..నువ్వసలున్నావా?"
ఎంత తిన్నగా వెళ్ళినా లెఫ్ట్ తర్న్ ఎక్కడ తీసుకోవాలో తెలిసింది గాదు. ఒకచోట మాత్రం పెద్దగా లైట్లు కనిపించాయి. సరే మన అదృష్టం చూఒద్దామని తిన్నగా వెళ్ళి చూస్తే అదో పెట్రోల్ బంక్.

ఆహ్..తిరుమల వాసా నువ్వింత తొందరగా ప్రార్థనలు వింటావా..ఐతే పెద్ద కోరికేదో కోరుకుందునే అనుకుంటూ పాట మార్చాను.
"దేవుడ దేవుడా తిరుమల దేవుడా.. ఉన్నావౌ ఉన్నావు నువ్ గ్యారంటిగున్నావు. ఇవాళ నన్నెందుకు పరీక్ష చేస్తున్నావు?"
బంకులో పెట్రోల్ పోయించి కాస్త ఊపిరి పీల్చుకొని,
"భాయ్ సాబ్, నాంపల్లి కైసే జానా?"
"ఇట్ల సీధ బొయి లెఫ్ట్ తిరుగుతే నాంపల్లి".
లెఫ్టా? టొటల్ల్య్ అన్ - ఇంట్యూటివ్ గ చెప్తున్నాడే వీడు?? వినాలా వొద్దా? కొంపతీసి వెనకే ఎవరినన్నా పంపించడుకదా? ఆలోచిస్తూ సీధా వెళ్ళి లెఫ్ట్ తిరిగి ఎందుకైనా మంచిది అని ఒకరినడిగా.
"కహా జాన హై తుంకో?"
"నాంపల్లి"
"యెహీ నాంపల్లి హై"
ఇదేవిటీ? చాయమాత్రంగానైనా అనిపించట్లేదు?
"ముఝే స్టెషన్ జానా హై"
"తొ పీచే జావో"

సరేనని వెనక్కి తిరగ్గానే పేద్దరోడ్డు. అరగంటగా నేను చలిలో వణుకుతూ, టెన్షన్ టెన్షన్ గా వెతుకుతున్న రోడ్డు. బతుకుజీవుడా అంటు ఇంటిదారి పట్టాను.

కాస్త ముందుకెళ్ళి ప్రాణం కుదుటపడ్డాక ఇంతమంది సరైనదారి చెబితే, వాళ్ళ అవతారాలు చూసి, ఒక్కణ్ణీ నమ్మక ఆ రోడ్లు గల్లీల్లో టెన్షన్ వల్లో ఏమో ఒక్కరికి థాంక్స్ చెప్పలేదని గుర్తొచ్చింది. ఛ ఛ. ఎంత సిగ్గుచేటు..ఒకసారి పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథ గుర్తొచ్చింది.

నా డైరెక్షన్ సెన్సునూ, ఓవర్ కాంఫిడెన్స్ ని తిట్టుకుంటూ, దేవుడికి క్షమాపణలు చెప్పి లెంపలేసుకుని వెచ్చగా ఇంట్లోకి వచ్చిపడ్డా. అదీ సంగతి.

Tuesday, December 01, 2009

పండిట్ జస్రాజ్ మేజిక్

పండిట్ జస్రాజ్ సంఈతోత్సవం జరుగుతుందని వారం రోజులుగా మా మేష్టారు చెబుతున్నారు. ఇరవయ్యేడున ఎవరో స్నేహితుడు ఇంటికి వచ్చాడని వెళ్ళలేదు. ఇరవై ఎనిమిదిన బక్రీద్ గోల ఉంటుందని వెళ్ళలేదు. (ఈ ఉత్సవం జరిగే చౌమొహల్లా పాలస్ మక్కా మసీదు వెనకాలే ఉంది). ఇరవయితొమ్మిదిన ఇంట్లో ఏదో సెలబ్రేషన్. మా తబ్లా మేష్టారు కాస్త గాఠ్ఠిగా చెప్పారు. ఇవాళ ఎలాగైన వెళ్ళాల్సిందే. ఇవాళ యోగేష్ సంసి తబ్ల సోలో ఉంది. వెళ్ళి వినిరా అని. నాకు మొదట ఆ చౌమొహల్లా పాలస్ వెతకాడానికి బద్ధకం. ఓల్డ్ సిటీలో ఎక్కడో ఉందది. అంతరాత్రి పూట ఓల్డ్ సిటీలో ఇరుక్కోవడం అసలే మంచిది కాదని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ తప్పిస్తున్నాను. ఇక గురువాజ్ఞ కాదనలేక ఆ తబ్లా ఒక్కటీ అటెండ్ అవుదామని రాత్రి ఏడున్నరకు ఒక్కణ్ణి వెళ్ళాను. తొమ్మిదివరకు వెనక్కొచ్చేద్దామని ఇంత చలిలో కనీసం ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా బైక్ మీద వెళ్ళాను.

ఎనిమిదింటికి నిదానంగా మొదలయ్యింది. మొదట జస్రాజ్ సంతానమంతా కలిసి శిష్యులతో ప్రార్థన నిర్వహించారు. రెండు బందిష్‌లు మేవాతీ ఘరానా వాళ్ళు రాసినవి. శిష్యులంతా కలిసి పాడి బాగా రక్తి కట్టించారు. తరవాత శశాంక్ ఫ్లూట్ కచేరీ అన్నారు. ఈ యోగేష్ సంసి ఎప్పుడు వస్తాడో ఇంటికి ఎప్పుడు వెళ్ళాలో అనుకుంటూ కూర్చున్నాను. ఐదు నిమిషాలయ్యాక అర్థమయ్యింది. ఈ శశాంక్ కర్నాటిక్‌లో ఆల్రెడీ పేరు మోసిన చైల్డ్ ప్రాడిజీ ఫ్లూటిస్ట్ శశాంక్ అని. అరగంటసేపు వాగధీశ్వరీ రాగంలో శ్రోతల్ని ముంచి తడిపేశాడు. రాగం-తానం-పల్లవి, పక్క వాద్యాల్లో ఒక మృదంగం, ఒక తబ్ల సహకారం. వాహ్..ఫర్లేదు ఇంత దూరం వచినందుకు ఇది వినే అవకాశం దక్కిందని సంతోషపడిపోయాను. ఈ కర్నాటిక్ సంగీతకారుడు హిందుస్తానీ కచేరీలో ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? శశాంక్ ప్రస్తుతం జస్రాజ్ గారి దగ్గిర మేవాతీ ఘరానాలో శిక్షణ పొందుతున్నాడు. ఎంత శిష్యుడైనా అల్రెడీ మరో సంప్రదాయంలో పండితుడేనని కర్నాటిక్ కచేరీ నిర్వహింపచేశారు. నిజంగా ఎంత బాగుండిందో... ఆసక్తి ఉన్నవాళ్ళు మళ్ళీ ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే కచేరీకి వేళ్ళవచ్చు.

తరవాత మొదలయ్యింది సంసీ గారి కచేరీ. ఏడాదిగా తబ్లా పాఠాలు నేరుస్తూ అంతవరకూ జరిగిన పర్కషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తబ్ల కచేరీ మాత్రం ఒక్క ముక్క అర్థమైతే ఓట్టు. తీన్‌తాల్ అని అర్థమయ్యింది గానీ ఆయన పేషకారీ కాయిదాలు, కాయిదాలు, రేలాలు రాకెట్ స్పీడులో నడిచాయి. వర్షం కురిసినట్టు ఒకటే గిడనగలు, కిడతకలు, తిరకిటలు. నా స్థాయికి చాలా ఎక్కువని తెలిసింది. విశ్వవిఖ్యాత అల్లా రఖా, జాకీర్ హుస్సేన్ శిష్యులాయన. నాకు ఆస్వాదించేంత తబ్లా తెలీకపోవడం నా దురదృష్టం. (పాఠాలు ఇలాగే కంటిన్యూ చేస్తే బహుశా వచ్చే ఏడాది..). శ్రోతలు కూడా పాపం అంతగా ఎంజాయ్ చేసినట్టు లేదు. ఇక సంసీ గారు డెస్పరేట్ అటెంప్ట్లో తబ్లా బోల్స్ వోకలైజ్ చేస్తూ వాయించడం మొదలెట్టారు. నాకైతే ఎందుకో రసాభాస అయ్యిందని అనిపించింది. అప్పటికే పదిన్నర. అదయ్యాక వెళ్దామని బయల్దేరుతున్నానో లేదో పెద్ద హంగామా మొదలయ్యింది. ఎక్కడెక్కడివాళ్ళో వచ్చి సీట్లో కూర్చోవడం మొదలెట్టారు. విషయమేంటా అని కనుక్కుంటే అప్పుడే జస్రాజ్ గారి కచేరీ మొదలవుతుందని చెప్పారు. ఒకవైపు చలి, రాత్రి పన్నెండవుతుందేమో అయిపోయేసరికి అని ఆలోచిస్తూ కాసేపు విందాంలే అనికూర్చున్నా.

పదకొండింటికి మెల్లగా మొదలయ్యింది మాజిక్. ఒకవైపు చలి వణికించి ఇంటికి వెళ్దామంటుంటే, మరో వైపు జస్రాజ్ గారి సంగీతం ఒకపట్టాన వెళ్ళనివ్వదు. మొదట శంకరుని స్తుతిస్తూ ఒక ఆలాపన. తరువాత అల్లాహ్ మెహెర్బాన్ అని ఒక బందిష్(ఆయన రాసిందే). నిజంగా అల్లా కిందకు దిగివస్తాడేమో అన్నట్టు పాడారు. పక్కనే మక్కా మసీదు వైపు చూస్తూ అల్లా, అల్లా అని పిలుస్తుంటే కాసేపు అందరం కులమతాలకతీతంగా అల్లా వస్తాడేమో అని చూశాం. నిజంగా అదొక డివైన్ అనుభూతి. అప్పటికి పావు తక్కువ పన్నెండయ్యింది. ఇల్లు గిల్లు చలీ గిలీ అప్పటికి అన్నీ మరిచాను. మాతా కాళికా అని అడానా రాగాన్ని ఎత్తుకున్నారు. అసురహరణీ, అసురహరణీ... మా మా.. అని పిలుస్తుంటే ఓహ్....నిజంగా అదో అలౌకికానుభూతి. ట్రాన్సెండెంటల్ ఎక్స్‌పీరియన్స్. పాట ముగిసి అందరు చప్పట్లుకొడుతుంటే మెల్లిగా తేరుకొని ఈలోకంలోకి వచ్చాను. ఒకసారి ఆలోచిస్తే నాకసలు జస్రాజ్ కచేరీ ఉందనే తెలీదు. వచ్చింది యోగేష్ సంసీ తబ్లా కోసం. అందులో ఏమీ అర్ధం కాలేదు. బాగా ఎంజాయ్ చేసింది మాత్రం జస్రాజ్ గారి సంగీతం, శశాంక్ ఫ్లూట్.

ఇంటికొచ్చి అసలు నేను వెళ్ళిందిఏం ఉత్సవం అని నెట్లో శోధిస్తే తెలిసింది. ప్రతి సంవత్సరం హైదరబాద్‌లో నవంబరు 27 నుండి ముఫ్హై వరకు "పండిట్ మోతీరాం పండిట్ మణిరాం సంగీత సమారోహ్" ఉత్సవరం జరుగుతంది. గత ముప్ఫై ఏడేళ్ళుగా జరుగుతోందీ ఉత్సవం. పండిట్ మోతీరాం (జస్రాజ్ గారి తండ్రి), పండిట్ మణిరాం (ఆయన అన్న) జ్ఞాపకార్థం ప్రతిసంవత్సరం మేవతీ ఘరానా కళాకారులు హైదరబాద్‌లో జరుపుతారీ ఉత్సవాన్ని. ప్రవేశరుసుము గట్రా ఉండవు. ఓపెన్ ఫర్ ఆల్. పాపం మోతీరాం గారిది చాలా ట్రాజిక్ స్టోరీ. ఆయన నిజాం అస్థాన విద్వాంసులుగా నియమించబడే రోజు నవంబరు 30న పరమపదించారు. ఇక ఆయన కుటుంబం హైదరాబాదులోనే సెటిల్ అయ్యింది. పెద్దకొడుకు మణిరాం పోషణ భారం తన మీద వేసుకొని జస్రాజ్ కు సంగీతం నేర్పించాడు. జస్రాజ్ మొదట తబ్లా నేర్చుకున్నా పధ్నాలుగో ఏట అది మానేసి వోకల్ వైపు మరలాడు. ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ అంతటి వాడు నిన్ను శిష్యుడుగా చేస్తుకుంటాను అంటే, లేదు నేను మా నాన్న సంప్రదాయాం నిలబెట్టాలి అని వద్దన్నాడట. తరువాత సినిమా డైరెక్టరు శాంతారాం కూతురుని పెళ్ళి చేసుకున్నాడు. శాంతారాం సినిమా సంగీతంలో మున్ముందు బోలెడు డబ్బులున్నాయి ఇందులోకి దిగిపో అంటే, రూపాయికి ఆశపడి చేతిలో ఉన్న పావల పడేసుకోను అనిచెప్పాడట. ఏది రూపాయి? ఏది పావలా? :) డెభ్హయ్యెనిమిదేళ్ళ వయసులో చలిని లెఖ్ఖ చేయక తన తండ్రికి సంగీతనివాళి అర్పించిన తీరు మనోహరం.

ఏదైతేనేం ఒక్కటి మాత్రం నిజం. ఇకపై నవంబరు 30 న హైదరాబాదులో ఉంటే మాత్రం జస్రాజ్ గారి కచేరీ మిస్సయ్యే ప్రశ్నే లేదు.