Thursday, September 17, 2009

మిలియన్స్ - ఒక డానీ బోయ్ల్ సినిమా

స్లండాగ్ మిలియనీర్ తీసి డానీ బోయ్ల్ ఇండియా అంతా ఫేమస్ అవకముందు 2004లో తీసిన సినిమా ఇది. క్రిటిక్స్ సంగతేమో తెలీదు కానీ నాకైతే నా ఆల్‌టైం టాప్ 5 లో ఉంటుందీ సినిమా. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే మనలోనూ ఎక్కడో ఒక పసిమనసు దాగుండాలి అంటారు.డానీ బోయ్ల్ లో మాత్రం తప్పక ఒకపసివాడున్నాడని నా అనుమానం.

కథ విషయానికొస్తే డేమియన్, ఆంథొనీ ఇద్దరన్నదమ్ములు. ఇద్దరి వయసు ఎనిమిది నుండి పన్నెండేళ్ళ లోపే. వాళ్ళమ్మ పోవడంతో, నాన్నతో పాటు ఒక కొత్త నెయిబర్‌హుడ్ కి మారతారు. పెద్దవాడైన ఆంథొనీ స్ట్రీట్ స్మార్ట్ కిడ్. చిన్నవాడైన డేమియన్‌కి క్రిస్టియన్ సెయింట్స్ కనిపిస్తుంటారు. వాళ్ళందరితో తరచూ మాట్లాడుతుంటాడు. ఆంథొనీ, వాళ్ళ నాన్న ఇదొ పిచ్చిగా భావించి పట్టించుకోరు. డేమియన్‌కి చనిపోయిన వాళ్ళమ్మ సెయింట్ గా మారిందో లేదో అని ఒక దిగులు. కనిపించిన సెయింట్సందరినీ అడుగుతుంటాడు. ఇదిలా ఉండగా లండన్‌లో జరిగిన బాంక్ రాబరీసొమ్ము ఒక మిలియన్ పౌండ్ల బాగ్ డేమియన్ చేతికి చిక్కుతుంది. మూర్తీభవించిన మానవత్వం, అమాయకత్వమైన డెమియన్ ఆ డబ్బులు దేవుడే పంపించాడని పేదవాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటాడు. తనకి కనిపించే సెయింట్స్ కూడా అవుననే చెబుతారు. ఇక డేమియన్ డబ్బుల్ని పేదవాళ్ళనుకున్న ప్రతివారికిస్తుంటే ఆంథొనీ ఎవ్వరికీ తెలీకుండా జాగర్తపడుతుంటారు. ఉన్నట్టుండి వచ్చిన డబ్బుల్తో ఆంథొనీ స్కూల్లో స్టార్ స్టేటస్ మెయింటెయిన్ చేస్తుంటాడు. ఈలోగా ఒక దొంగకి కొంచెం అనుమానమొచ్చి డేమియన్ ఆంథొనీల వెంటపడుతాడు. డేమియన్ ఆ దొంగ నుండి తప్పించుకొని ఆ డబ్బులకెలా న్యాయం చేశాడు? సెయింట్సంతా తనకి ఎలా తోడ్పడ్డారన్నది మిగతా సినిమా.

సినిమా నిండా డానీ బోయ్ల్ మార్కు సన్నివేశాలు, అంతర్లీనమైన హాస్యం పుష్కలంగా ఉంటుంది. పిల్లలిద్దర్నుండి అద్భుతమైన నటన రాబట్టుకున్నాడు. రెండు వేల నాలుగులో నేను చూసినప్పటినుండీ ఎంతో మందికి చూపించానీ చిత్రాన్ని. బాలేదన్న వాళ్ళొక్కరూ లేరు ఇప్పటివరకు. మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఎలాగోలా సంపాదించి చూడండి.

తా.క. సోనీ పిక్స్‌లో గురువారం రాత్రి ఈ సినిమా చూసి సడన్‌గా ఇదంతా చెప్పాలనిపించింది. :) స్లండాగ్ మిలియనీర్ కంటే ఈ సినిమాకి డానీ బోయ్ల్ కి ఎక్కువ పేరు రావల్సింది. (స్లండాగ్ - గ్లోరిఫైడ్ పావర్టీ అనుకునేవాళ్ళలో నేనూ ఒకణ్ణి.)

Thursday, September 10, 2009

హర్భజన్ సింగ్ వివాదం మీడియా ఓవరాక్షన్

క్రింద వీడియో చూడండి. నిజంగా హర్భజన్ ఎవరినైనా పంచ్ చేశాడా?ఎవడైనా కెమెరాతో మన తలను తాటిస్తే ఏం చేస్తాం? ఇలాంటి సొల్లు కబుర్లను ఎందుకు మీడియా సెన్సేషనలైజ్ చేస్తోంది?ప్రేక్షకులారా/పాఠకులారా జాగర్త. ఇంకోసారి మీడియా ఏదైన సంచలనాత్మక వార్త రాస్తే నాణానికి ఆవైపేం జరిగిందో అని కూడా ఆలోచించండి. గుడ్డిగా నమ్మకండేం.


Wednesday, September 09, 2009

రైడింగ్ అలోన్ ఫర్ అ థౌజండ్ మైల్స్

యిమూ ఝాంగ్ అనగానే ప్రపంచసినిమాలో ఆసక్తి ఉన్న ప్రతివారికీ గుర్తొచ్చేది "హీరో" సినిమా. ఇంకా house of flying daggers సినిమా. కేవలం యాక్షన్ సినిమాలే తీస్తాడేమో అన్న భ్రమలను పటాపంచలు చేస్తాడీ సినిమాతో. స్థూలంగా కథనానికి వస్తే :
జపానీయులైన తకత, కెనిచి తండ్రీ కొడుకులు. కెనిచి వాళ్ళమ్మ మరణంతో ఇద్దరికీ మనస్పర్ధలొచ్చి ఒకరినొకరు కలుసుకోకుండా విడిపోతారు. చాన్నాళ్ళకు కెనిచికి ఒంట్లో బాలేదని తెలిసి తకత జపాన్ వస్తాడు. కానీ కెనిచి తండ్రిని చూడడానికి నిరాకరించేసరికి తకత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. కెనిచి భార్య తను నిర్మించిన డాక్యుమెంటరీ ఒకటి తకత కి కానుకగ ఇస్తుంది.
ఊరెళ్ళిన తకత ఆ డాక్యుమెంటరీ చూస్తాడు. అందులో కెనిచి ఒక చైనీయ జానపదనృత్యాన్ని చిత్రీకరిస్తూ, ఆరోజు లీడ్ సింగర్ గొంతు బాలేకపోవడంతో అతని గానమొక్కటి రికార్డు చేయలేకపోతాడు. ఇంతలో కెనిచి కి లివర్ కాన్సర్ అని తెలుస్తుంది తకత కి. కొడుకు కోసం తకత చైనా వెళ్ళి ఆ డాక్యుమెంటరీ షూట్ చేసి తీసుకువద్దామనుకుంటాడు. దాంతో మొదలవుతుంది తకత పయనం. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ లీడ్ సింగర్ జైల్లో పడ్డం, అదికారుల కాళ్ళా వేళ్ళా పడి పర్మిషన్ సంపాదించి జైలుకి వెళ్తే ఆ రోజు ఎక్కడో పుట్టిన కొడుకును తలచుకొని లీడ్ సింగర్ పాడలేకపోతాడు. ఇలాకాదని తకత వాళ్ళ కొడుకు యాంగ్‌యాంగ్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఊరివాళ్ళనొప్పించి తనని తీసుకువస్తుంటే దార్లో వాళ్ళిద్దరూ తప్పిపోయి ఒక రాత్రంతా కాన్యన్స్‌లో తప్పిపోతారు. ఆ రాత్రీ, మొత్తం ఈ ప్రయాణంలో తకత తన గురించి, కొడుకు గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకుంటాడు. మరి ఆ డాక్యుమెంటరీ చివరికి షూట్ చేయగలిగాడా? కెనిచి కి ఏమవుతుందీ? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోండి.
సినిమాలో ఆకట్టుకొనేవి రెండు విషయాలు. విజువల్స్. యిమూ ఝాంగ్ సినిమాల్న్నీ దృశ్యకావ్యాలే (మన సంజయ్ లీలా భన్సాలి గుర్తొస్తారు. ప్రతీ ఫ్రేం విజువల్ రిచ్‌నెస్‌టో ఉట్టిపడుతుంది). ఇక రెండవది, ముఖ్యమయింది ఒక బాధని సినిమాలోకి అనువదించడం. దాన్ని సమర్థవంతంగా చిత్రీకరించలేకపోతే చిత్రం తేలిపోయేది. ప్రతీ పాత్రను ఎంతో హుందాగా తీర్చిదిద్దారు. జీవితమే ఒక వేయిమైళ్ళ పయనం. పంతాలకు పట్టింపులకుపోయి దాన్ని ఒంటరి పయనంగా మార్చుకుంటే ఎడతెగని పయనమవుతుంది. బోలెడు బంధాలు ప్రేమలు, బ్రేకప్పులు, మేకప్పులతో సందోహంతో గడిపితే కలగా మిగులుతుంది. మంచి కళ రసికున్ని వేరే time and space లోకి transcend చేస్తుందంటారు. ఈ సినిమా ముమ్మాటికీ అదేపని చేస్తుంది.మీకు కాస్త నిదానంగా నడిచే మీనింగ్‌ఫుల్ సినిమాలు చూడ్డంలో అట్టే అభ్యంతరం లేకపోతే తప్పక చూడొచ్చు.

ఈ సినిమా చూశాక నాకు ఇస్మాయిల్ కవితొకటి గుర్తొచ్చింది. కవిత ఇక్కడ.
===
రికార్డు (ఇస్మాయిల్ విరచితం)

తిరిగి తిరిగిరికార్డుపాట అంచున ఆగుతుంది.
ఇప్పుడు దీని కర్తెవరో చదివి తెలిసికోవచ్చు.
జీవితం ఆగినా కర్త పేరు తెలీదు.

రికార్డుకు మల్లే దీన్ని మళ్ళీ వేయలేం.
వేసినా మొదటిలా ఉండదేమో.
కవిత్వం లాగే
మరో మారు చదివితే మొదటిలా ఉండదే.
కన్యాత్వం పోతుంది.

సాఫీగా సాగే రికార్డు ఆయుష్షు మూడు నిమిషాలు.
గాడి పడితే అనంతం.
బాధ - జీవితానికి గాడి.
=====

Tuesday, September 01, 2009

నేను చదివిన మొదటి నవల

పుట్టగానే ఎక్కడ బోల్డు సుఖపడిపోతానో అని కాబోలు దేవుడు నాకంటే ముందు అన్నయ్యని పుట్టించి ఉంచాడు. నాకు బుద్ధి తెలిసినప్పటినుండి మేమిద్దరం పోటీ పడని క్షణం లేదు. అన్నం దగ్గిర ఎవరు ఫస్ట్ డిష్ టేస్ట్ చూస్తారో, ఎవరు ఫాస్ట్‌గా తింటారో, ఎవరు ఫస్టు చేతులు కడుక్కుంటారో అని, హోంవర్క్ ఎవరు ఫస్ట్ పూర్తి చేస్తారోనని, స్కూల్ నుండి ఎవరు ఫస్ట్ వస్తారో అని....ఉఫ్....ఇంట్లో రోజూ రామరావణ యుద్ధాలే.

ఒక్కవిషయంలో మాత్రం ఈ పోటీ ముదిరి పాకాన పడేది. ఎందుకంటే ఆ పోటీలోగనక ఓడిపోతే, ఇక నెలరోజులు ఎదుటివాడి దెప్పులు భరించాలి. అదే చందమామ ఎవరు ఫస్ట్ చదువుతారో అన్న పోటీ. నెలలో మొదటి మూడు రోజులు పేపరువాడికోసం పొద్దున్నే కాపలా కాసేవాళ్ళం. పొరపాటున మనం లేని సమయంలో చందమామ వస్తే? హమ్మో ఇంకేమైనా ఉందా.. అన్నయ్య దాచిపెట్టేసి స్కూలునుండి రాగానే చదివేయడూ..అబ్బో అదొక టెన్స్ లైఫ్ లెండి. ఎనీవే, కొన్నాళ్ళకి సంధి కుదుర్చుకొని చందమామని వదిలేశాం ఎందుకంటే ఇద్దరం తోడుదొంగలుగా ఒక పని చేయాల్సి వచ్చింది.

ఎండాకాలం సెలవులొచ్చాయి. మధ్యాహ్నం బయటకి వెళ్ళామని తెలిసిందో సాయంత్రం బడితెపూజ(అప్పుడప్పుడు బెల్టుపూజ) జరిగేది. పోనీ మూడుగంటలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామంటే రోజూ వేళ్ళు నెప్పులు పుట్టేలా ఇరవయెక్కాలు రాయించేవారు. అమ్మ పడుకునేదాక ఏదో గీకేసి పడుకోగానే మా రహస్య స్థావరంలోకి వెళ్ళేవాళ్ళం. స్థావరమంటే ఎక్కడో ఉందనుకునేరు. మా ఇంట్లోనే పట్టెమంచాలు గోడవారగా వేసి పెట్టి వాటిపై బట్టలారేసేవాళ్ళు. దాంట్లో దూరి చక్కగా షాడో నవల్లు చదివేసేవాళ్ళం. దీంట్లో ఆశ్చర్యమేముందా? (నాకప్పుడు ఏడేళ్ళు, అన్నయ్యకు తొమ్మిది). అప్పుడు మాకేమర్థమయ్యేవో, ఎందుకు చదివేమో ఇప్పటికీ నవ్వొస్తుంది తలచుకుంటే. బహుశా వెధవపని చేస్తున్న థ్రిల్ అనుకుంటా :) మొత్తానికి ఒక వేసవి కాలం నాన్న దగ్గిరున్న షాదో నవలల్ సిరీస్ అంతా చదివి మేం కనిపెట్టిందేమంటే అన్నీ ఒకేలా ఉంటాయి డొక్కు నవల్లు...నాన్నగారెందుకు చదువుతారో ఏం పాడో అని. అలాగే ఆంధ్రభూమి, యువ ఇలాంటివన్నీ చదివేసేవాళ్ళం. అమ్మకు తెలిస్తే వీపు చీరేస్తుందని తెలిసీ. అప్పట్లో యువ దీపావళి సంచిక అని ఇంతేసి లావుపాటి పుస్తకమొచ్చేది. అలాగే ఒక చిన్న నవల కూడా ఉండేది (యువదో, స్వాతిదో). అన్నీ చదివేవాళ్ళం ఒక నవల తప్ప. మల్లిక్ కార్టూన్లు, రాగతి పండరి ముగ్గుల కార్టూన్లు చదువుకొని బోల్డు నవ్వుకునేవాళ్ళం. కథలు చదివినట్టు గుర్తు కానీ నవలలు మాత్రం పెద్దయ్యాకే చదవాలని ఒక అన్‌స్పోకెన్ రూల్ ఉండేది..

మూడేళ్ళకో బదిలీతో నాన్న ఊర్లు మారడం మొదలవగానే అన్నయ్యని బాబాయి దగ్గరకి, నన్ను హాస్టల్కి పంపించేశారు నాన్న. మొట్టమొదటి సారి హాస్టల్లో నాలుగునెలలు ఏకధాటిన అమ్మ నాన్నలకి దూరంగా ఉండి రేపనగా ఇంటికి వెళ్తామన్న రోజు. ఆ రోజెందుకో బోలెడు ఫ్రీ టైం దొరికి హాస్టల్లో 'చెక్కీ అని ఓ మిత్రుడి దగ్గరకి వెళ్ళాను. (అసలు పేరు రమేశ్ చక్రవర్తి లెండి). మా చెక్కి గాడి దగ్గిర ఒక పెద్ద నవల కనిపించింది. టైటిల్ "ఏడు తరాలు". ఇప్పుడైతే చూసేవాళ్ళు, వద్దనేవాళ్ళు ఎవరూ లేరు కదాని చదవడం మొదలెట్టా. సాయంత్రం మొదలెడితే రాత్రి అందరు పడుకున్నా వదల్లేదు. నేను ఓరాత్రి మూడింటివరకూ ఆ నవల చదువుతూ ఉండిపోవడం ఇప్పటికీ గుర్తు. ఆరో తరగతిలో రాత్రంతా మేల్కొని చదివింపజేసిన ఆ నవల అంటే ఇప్పటికీ నాకు భలే ఇష్టం. ఒకవైపు ఆ బానిస నాయకుడి బాధననుభవిస్తూ, మరోవైపు నవల చదువుతున్నందుకు థ్రిల్లవుతూ బాగా గుర్తుండి పోయిందా రోజు.ఇంజనీరింగులో జాయిన్ అయ్యాక మళ్ళీ ఆ పుస్తకం ఏక్కడ దొరుకుతుందని తెగ ట్రై చేశా. అందరు తెలుసని చెప్పేవాళ్ళే కానీ అదెక్కడా దొరికేది కాదు. ఒకరోజు పేపరు చదువుతుంటే తెలిసింది. అది "రూట్స్" అనే గొప్ప నవలకు అనువాదమని. ఇక ఒరిజినల్ సంపాదించి చదివి మళ్ళీ ఆ నాయకుడి బాధంతా అనుభవించాను. అమెరికాలో కూడా ఆ పుస్తకం మరొక్కసారి చదివాను. మొన్నీ మధ్య సహవాసి గారి అనువాదం చూసాను ఏడుతరాలకి. కానీ అది చిన్న పుస్తకం. నేను చదివింది సాహిత్య అకాడెమీ వారి బౌండు పుస్తకమని గుర్తు. మరెవరైనా ఈ నవలకి అనువాదం చేసారా? లేక నేను చదివింది సహవాసి గారి అనువాదమేనా అన్నది నాకు ఇప్పటికీ తేలని బేతాళప్రశ్న. ఆ తరువాత గోర్కీ అమ్మ, దాశరధి చిల్లర దేవుళ్ళు చదివాను. అవి కూడా అద్భుతమైన పుస్తకాలు. అవండీ నేను మొట్ట మొదట చదివిన మూడు నవల్లు. మూడు గొప్పవే.

ఇదంతా చదువుతుంటే మీరు చదివిన మొదటి నవల గుర్తొచ్చిందా? ఆలస్యమెందుకు..వేసెయ్యండొక టపా.
తా.క.: అన్నయ్యకీ నాకు ఇప్పుడు పోటీలేదు గానీ, పుస్తకాలు వొరేషియస్ గా చదివే అలవాటు ఇప్పటికీ ఇద్దరికీ పోలేదు. పుస్తకాలే లేకుంటే లైఫ్ ఎంత బోర్ కదా.