Tuesday, August 25, 2009

బాబోయ్.. వినాయక చవితి

చిన్నప్పుడు వినాయక చవితి ఎప్పుడొస్తుందని ఎంతగా ఎదురుచూసేవారమో. నేను పెరిగింది ఒక చిన్న ఊర్లో. గోదావరి ఒడ్డున. అప్పటికింకా జనాల మీద కేబుల్ దండయాత్ర జరగలేదు. కేవలం డీడీ చానల్ తో టీవీ ప్రభావం ఎక్కువ ఉండేది కాదు. తొమ్మిది రోజులూ భజనలు, ప్రసాదాలు, గణపతులు చూస్తూ ఊరంతా ఒకటే తిరగడం. ఇక తొమ్మిదోరోజు గోదావరి దగ్గర పెద్ద ఉత్సవం. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇరవి యేళ్ళు. వినాయక చవితి వస్తుందంటే వామ్మో ఈ తొమ్మిది రోజులు ఎక్కడికైనా పారిపోదామనిపిస్తోంది.
అసలు హైదరబాద్ లాంటి నగరాల్లో ఉండడమే ఒక పెద్ద పనిష్మెంటు. బడికి వెళ్ళాలన్న, ఆఫిసుకి వెళ్ళాలన్నా ట్రాఫిక్ మహాసాగరాలు ఈదాలి. పీల్చడానికి మంచి గాలి ఉండదు. కాస్త సాయంత్రం ఎక్కడైనా తిరిగొద్దామంటే అట్టే జనాలు లేని పార్కులుండవు. వీకెండ్స్ ఆడుకుందామంఏ ఓ గ్రౌండు దొరకదు. క్వాలిటీ ఒఫ్ లైఫ్ ఎంత వరస్టుగా ఉంటుంది. వీటన్నిటికి తోడు ఈ తొమ్మిది రోజులు వినాయకుని పేరు చెప్పి సాయంత్రాలైతే చాలు మైకులతో హోరెత్తిస్తుంటారు. ఒకే వీధిలో రెండు మూడు వినాయకులు ఒకరితో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఎందుకొచ్చావురా దేవుడా అనుకునేలా చెస్తారు. పొద్దున్నే ఆరింటికే మైకుల్లో సుప్రభాతాలు, సుందరకాండలు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిని కూడా కాసేపు నిశ్శబ్దంగా ఉండవమ్మ తల్లీ అనాలనిపిస్తుంది. పొరపాటున ఎవరినైనా ఆపమన్నామో మనం మొత్తం కాలనీకి, అపార్టుమెంటు కాంప్లెక్సుకి శతృవులమైతాం. భక్తి కాస్త ఉన్మాదంలోకి మారిపోతుంది. ఏ రోజుకి వాళ్ళు ఐదు సార్లు మైకుల్లో అరుస్తుంటే ఎప్పుడూ అడగరే? అని దానికి కమ్యూనల్ రంగు పులుముతారు. ఇదంతా చూస్తే ఎప్పుడో చర్చిల్ అన్న మాట గుర్తు వస్తుంది. I dont have a problem with christ but with christians నాకూ అదే అనాలనుంది. దేవుడా నాకు నీతో సమస్యలేదు కాని నీ భక్తులనుండి మాత్రం నన్ను రక్షించు.
తా. క. ఇలాంటిదే తిలక్ కవిత ఏదో ఉన్నట్టు గుర్తు, కుదిరితే ఇక్కడ పోస్టు చేస్తాను.

Wednesday, August 19, 2009

ఇస్మాయిల్

మన తెలుగు కవిత్వం మీద శ్రీ శ్రీ, క్రిష్ణశాస్త్రి, తిలక్‌ల ప్రభావం ఎంతటిదో చెప్పనలవి కాదు. కొత్తగా రాసేవారు మొదలుకొని, దిగ్గజాలవరకు ఇప్పటికీ అదే ప్రభావంలో రాస్తున్నారు. ఇలాంటి సాహిత్యమఱ్ఱి చెట్లకింద మరో వృక్షం పుట్టుకురావాలంటే ఎంత ధీశక్తి, నిబ్బరం ఉండాలి. సరిగ్గా అలాంటి వాడే ఇస్మాయిల్. ఈ కవులందరినీ ఎంతో మెచ్చుకున్నా, వీరిని కాదని తెలుగు కవిత్వానికి మరో దిశను పరిచయం చేసిన కవి. మనతరంలో చాలా మందికి తెలుగు కవిత్వంతో పరిచయం పదోతరగతితో ముగుస్తొంది. ఏ పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం వల్లో ఏమో జనసామాన్యానికి ఇస్మాయిల్ కవిత్వం గురించి అంతగా తెలవదు. అలాంటి ఇస్మాయిల్ ని గుర్తు చేసుకుంటూ ఇవాల రెండు సాంపుల్ కవితలు. (ఇవేమీ ఆయన రాసినవాటిల్లో గొప్పవి కావు..ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి మాత్రమే)
1) నిద్దట్లో ఆమె కళ్ళు (ఇస్మాయిల్ : 1972)

అర్ధరాత్రి దూరాన
ఎక్కడో పడగ విప్పిన చప్పుడుకి
నిద్దట్లో కలవరపడి
పక్కకు తిరిగి
నన్ను హత్తుకుందామె.

ఆమెకళ్ళు
జలజలపారే
నిద్దర సెలయేటి
అడుగుని
గలగలమని పాడే
అందమైన
గులకరాళ్ళు.

ఈ మెరిసే నీళ్ళ చప్పుడుకి
ఆకర్షితులై
చీకట్లో మెసిలే
ఏవో వింత మృగాలు
ఆమె నిద్దుర ఒడ్డుల్ని
తచ్చాడుతాయి.

2) పాట (ఇస్మాయిల్ : 1978)

సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?

చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఏలా?

3) ఆత్మహత్య (ఇస్మాయిల్ : 1975)

తనని బాధిస్తున్న
ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచకా
ఎటో నడిచి పోయింది.


బ్లాగ్ మితృలకు ఆసక్తి ఉంటే మరిన్ని మరోసారి...
ఇట్లు మీ..

Monday, August 17, 2009

కమీనే

మాచిస్ సినిమా చూసి ఒక రెండు మూడు రోజులు ఆ సినిమా మాజిక్లో, ఒక నెలరోజులు ఆ సంగీతం మాజిక్లో ఉండిపోయా. అప్పట్నుండే నేను విశాల్ భరద్వాజ్ ఫాన్ని. ఈ అక్టింగ్ రాని ప్రియాంకతో, బేబీ ఫేస్డ్ షాహిద్తో సినిమా ఏంటా అనుకున్నా కమీనే గురించి వినగానే. కానీ కమీనే సంగీతం (సుఖ్విందర్, కైలాష్ ఖేర్..వాహ్ భయ్ వాహ్..) విని, సినిమా చూద్దాం అని కమిటయ్యా. and I am glad I did. మీకు గాంగ్ స్టర్ సినిమాలు, హత్యలూ, గన్ ఫైట్లు ఇలాంటివి నచ్చకపోతే సినిమాకి దూరంగా ఉండండి. మీకు క్వెంటిన్ టరంటీనో సినిమాలు నచ్చుతాయా? ఐతే ఈ సినిమా తప్పక చూడాల్సిందే. టరంటీనో ముంబై మీద సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పొచ్చు.
విషాల్ ఈ సినిమాకి దర్శకత్వంవహించి , మాటలు రాసి, పాటలు కంపోజ్ చేశాడు.(ఎస్వీ క్రిష్ణా రెడ్డి గుర్తొస్తున్నాడా?). నాకైతే ప్రతీ దాంట్లో తనదైన మార్కు చూపించాడనిపించింది. విశాల్ కి నూటికి ఎనభై మార్కులు వేయాల్సిందే. షాహిద్ కపూర్ది డబుల్ రోల్. ఒకదాంట్లో రెగ్యులర్ మిడిల్ క్లాస్ వాడైతే మరో దాంట్లో ముంబైలో బతకనేర్చిన చోటా మోటా నేరస్తుడు. నటనలో వైవిధ్యం ఉన్నా, మరో పెద్ద నటుడైతే ఇంకా రాణించేవారనిపించింది. ఇలా ఆథర్ బ్యాక్డ్ రోల్ వచ్చినపుడు నటనలో విశ్వరూపం ప్రదర్శించాలి కాని సినిమాలో మిగిలిన అందరి యాక్టింగ్ ముందు షాహిద్ కాస్త తేలిపోతాడు. ఇక ప్రియాంక విషయానికొస్తే వావ్ అనకుండా ఉండలేం. ఎట్టకేలకు ప్రియాంకకు యాక్టింగ్ వచ్చని ఒప్పుకోవాల్సివస్తుంది. లోకల్ లీడర్ చెల్లిగా, తన ప్రియుడిని దక్కించుకోడానికి ఏమైనా చేసే ఈ పాత్రలో జీవించింది. ఇక సపొర్టింగ్ కాస్టంతా శహభాష్ అనేలా నటించారు. చాలామంది నాకు తెలియనివాళ్ళే. ఏదో ఫిల్మ్ స్కూల్ గ్యాంగులాగుంది. అందరికీ నటనలో మంచి పట్టుంది. నేపథ్యంలో కనిపించే మరో పాత్ర ముంబై.అసలు ఈ సినిమాలో ముంబయిని చిత్రీకరించిన తీరు చూసి స్లమ్డాగ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి.
సినిమాలో ఐదు నిమిషాలు కూర్చోగానే ముగింపు తెలిసే సినిమాలూ, ఏ కథా లేకున్నా కథనాన్ని లాగీ పీకే సినిమాలూ, ఇంటర్వల్ వరకు కథ ముందుకి నడవని సినిమాలు చూసి విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక నచ్చుతుంది. అలా అని ఇదో ఫీల్ గుడ్ సినిమా మాత్రం కాదు. go and see it in a theater if u dont mind some gangster action.

Thursday, August 13, 2009

యాది - డా.సామల సదాశివ

పుస్తకాల కొట్టులో అవీ ఇవీ వెతుకుతుంటే, "ఈ పుస్తకం చదవండి సార్. బాగుంటుంది" అని సదాశివ గారు రాసిన "యాది" పుస్తకాన్నిచ్చారు. అప్పటికి సదాశివగారి పేరు నేను వినలేదు. ఈ వ్యక్తి పేరే విననపుడు ఈయన జ్ఞాపకాలు కొనాలా వద్దా అని మీమాంస చేస్తూ రెండూ పేజీలు తిరగేశాను. అంకితం పేజీలో, రచయిత మనవడికి పుస్తకాన్ని అంకితమిస్తూ "వారీ కార్తీకా! ఇగ పటు.." అన్న వాక్యం ఆకర్షిచింది. ఇంత ప్రేమగా, ఇంటిభాషలో రాసిన పలకరింపు చూసి ఫర్లేదు బానే ఉండొచ్చనుకొని కొన్నాను. ఆ నమ్మకాన్ని నూటికి నూరు పాళ్ళూ నిజం చేసిందీపుస్తకం.

డెభ్భయ్యేళ్ళ నిండు జీవితంలో రచయిత అభిరుచులగురించీ, అవి పెంపొందిచేందుకు దోహదపడిన వ్యక్తులగురించీ, విన్నవీ, కన్నవీ, మధ్య మధ్యలో ఉర్దూ, ఫారసీ కొటెషన్లతో చదువుతుంటే "అహా, కబుర్లు చెప్పడం కూడా ఒక కళే" అనిపించకమానదు. హిందుస్తానీ సంగీతం గురించైతేనేమి (రూపాయికోసం పావలా వదులుకోనన్న పండిట్ జస్‌రాజ్ కథా, సాక్షాత్తు రామక్రిష్ణ పరమహంస దగ్గిర కడుపు నింపుకున్న ఉస్తాదోంకే ఉస్తాద్ బాబా అల్లా-ఉద్దీంఖాన్ కథా, హిందుస్తానీ సంగీతాన్ని కఠోరగురువుల చెర విడిపించిన భాత్ఖండే, పలూస్కర్ల గురించి వివరాలు), తెలుగు సాహిత్యకారుల గురించి ఐతేనేమి ( ఆంగ్లంలో "les miserables" చదివి, అనువదించేందుకు ఫ్రెంచి నేర్చుకున్న వేలూరి శివరామ శాస్త్రి గారి కబుర్లూ, విమర్శకులతో చికాకు పడి ఫోటో పంపని విశ్వనాథ వ్యవహారమూ, మధురాంతకం రాజారాం గారితో వ్యక్తిగతానుబంధం), ఉర్దూ గురించైతేనేమి (ఉర్దూ తన అనుబంధం గురించి, రూమీ మస్నవీని, అంజద్ రుబాయీలనూ అనువదించడానికి తను చేసిన శ్రమా, కాళోజీ సోదరుల గురించి రాసిన వ్యాసాలు, సియాసత్ పత్రిక సంపాదకుల గురించి చెప్పిన కబుర్లూ) అన్నీ చదివించే వ్యాసాలే. 'ఉర్దూ' ఒక మతానికి సంబంధించిన భాషకాదనీ సార్వజనీనమని చేసిన్ చర్చ కూడా మన తరం వాళ్ళు ఆలోచించదగ్గ విషయం.

సదాశివగారి విలక్షణమైన నేపథ్యమే ఇంతటి వైవిధ్యంగల కబుర్లకు మూలమనిపిస్తుంది చదువుతుంటే. సదాశివ గారి విద్యాభ్యాసం నిజాం ఏలిన తెలంగాణాలో జరిగింది. కాబట్టి చదివింది ఉర్దూ భాషా, ఉర్దూ మాధ్యమం. ప్రాతఃస్మరణీయులైన గురువుల వద్ద అమరం, ప్రబంధాలు చదివి నేర్చిన సంస్కృతాంధ్ర భాషలు. ఇవి కాక మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల అబ్బిన మరాఠీ భాష. చిన్నతనంలో ఇలాంటి పునాది వేసుకున్నవారు బహుభాషావేత్తలు కాకుండా ఉండగలరా? ఈ బహుభాషా ప్రావీణ్యమే సదాశివగారు రెండు వారధులు నిర్మించేందుకు కారణమయింది. ఒకటి రూమీ మస్నవీకి, అంజద్ రుబాయీలకు మరియు తెలుగు పాఠకులకు.ఇంకొకటి తెలుగు సాహిత్యానికి 'సియాసత్' ఉర్దూ పాఠకులకు. పుస్తకమంతా అంతర్లీనంగా కనిపించే మరొక విషయం సదాశివ గారి సహృదయత. వారి గురువుల పట్ల, శిష్యుల పట్ల, మిత్రుల పట్ల ఆయన ఆదరాభిమానాలు, భేషజాలు లేని వ్యక్తిత్వం పాఠకులను తప్పక ఆకట్టుకుంటాయి.

ఇన్ని సుగుణాలున్న పుస్తకంలో పునరుక్తిదోషాలు మాత్రం ఎక్కువే. ఒక పత్రికలో ధారావాహికగా వచ్చినపుడు పునరుక్తి అంతగా బాధించదు. పుస్తకంగా తెచ్చినప్పుడు మాత్రం పునరుక్తులను పరిష్కరించాల్సింది. అలాగే పుస్తకం చివర్లో తన స్నేహితులను గుర్తుచేసుకుంటారు రచయిత. సంగీత సాహిత్య విషయాలతో అలరారిన ఈ పుస్తకంలో అవి అంతగా నప్పలేదు.

వేసవి సెలవుల్లో తాతగారింటికి వెళ్ళినప్పుడు ఆరుబయట పక్కలు వేసుకొని పడుకునేవాళ్ళం. పిల్లలందర్ని పెట్టుకొని తన సుదీర్ఘ జీవన జ్ఞాపకాలను కథలు కథలుగా చెబుతుండేవారు తాతగారు. ఆనాటి అనుభూతిని మళ్ళీ గుర్తు తెచ్చిందీ పుస్తకం.
(యాది : ఎస్. సదాశివ. ప్ర.2005. నవోదయ, విశాలాంధ్రలో లభ్యమవుతాయి. వెల: 100/-)
కొసమెరుపు: అంతగా నన్నాకర్షించిన "వారీ..ఇగ పటు" వాక్యం సదాశివగారిది కాదట. తిరుమల రామచంద్ర గారి నుద్దేశించి ఆంధ్ర బిళణ "కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి" పలికిన పలుకులట.
(ఈ పుస్తకం తరువాత, సదాశివ గారు సంగీత శిఖరాలు- అని హిందుస్తానీ కళాకారుల మీద ప్రత్యేకించి ఒక పుస్తకాన్ని వెలువరించారు. సంగీతప్రియులకు ఆ పుస్తకమూ పఠనీయమే).

Monday, August 10, 2009

మగధీర

వారమంతా ఎక్కడ చూసినా మగధీర ఎంత బాగుందోనని చెప్పుకోవడమే. హైప్ కాస్త ఎక్కువైనపుడు చాలా సార్లు సినిమాకి వెళ్ళి మనం నిరాశ పడిపోతాం. కానీ ఈ సినిమా నిజంగా హైప్‌కు తగ్గట్టే ఉంది. ఈపాటికి మీరు బోలెడన్ని సార్లు చదివి ఉంటారు. కాని తెలుగు తెరపై సాంకేతికంగా ఇంత మంచి చిత్రం ఒక చారిత్రక మలుపనే అనుకుంటున్నాను. సినిమలో కొన్ని సన్నివేశాలు బెన్-హర్, టెన్ కమాండ్‌మెంట్స్ ను గుర్తుకు తెచ్చేలా ఉనాయి. సో, తప్పకుండా చూడమనే చెబుతాను. థియేటర్లోనే చూడండి.
ఈ సినిమా పూర్తిగా డైరెక్టర్‌దే. ఆ సెట్లు, ఆర్టూ, స్క్రీన్ ప్లే అబ్బో..అనుకునేలా ఉన్నాయి. చాలా సన్నివేశాలు 300, హీరో (చైనీస్), సినిమా ను తలపింపజేస్తాయి. హీరోయిన్ కూడా బాగా నటించింది. చరణ్‌కు మాత్రం పూర్తి మార్కులు పడవు. ఇంకా డిక్షను ఇంప్రూవ్ చేసుకోవాలి. అరుంధతిలో సోనూ సూద్ విలనీ చూశాక, ఈ కొత్త విలన్ అట్టే నచ్చడు.
మొత్తమ్మీద ఈ సంవత్సరం మనకు రెండు మైల్‌స్తోన్ చిత్రాలు. అరుంధతి, మగధీర. సాంకేతికంగా మనమూ హాలివుడ్ లెవెల్లో తీయగలమని ఈ రెండూ చిత్రాలూ నిరూపించాయి. ఇక తదుపరి అడుగు ఒరిజినాలిటీ దిశగా వేయాలి. ఇకపై మన సృజనాత్మకతకు ఆకాశమే సరిహద్దు. అరుంధతిలో అంధురాలు ఢంకాలతో నృత్యం చేసే అద్భుత సన్నివేశం చైనీస్ సినిమా house of flying daggers నుండి స్పూర్తి పొందిందని తెలిస్తే మనసు చివుక్కుమంటుంది. అలాగే మగధీరలో కొన్ని సన్నివేశాలు.. కమాన్ గైస్.. lets be original.
ఇట్లు మీ..

అలనాటి ఆనవాళ్ళు

తెలుగు సినీ పరిశ్రమకు 75ఏళ్ళు నిండిన సందర్భంగా ఇప్పటివరకు వచ్చిన మంచి సినిమాల మీద వ్యాసాలు, కబుర్లతో వెలువరించారీ పుస్తకాన్ని. దాదాపు ఐదారు వేలసినిమాల్లోంచి మంచి చిత్రాలు ఎన్నటం కత్తిమీద సామువంటిది. అందరిని మెప్పించడం జరగనిపని. కావున అలాంటి వివరాల్లోకి వెళ్ళనే వెళ్ళను. ప్రతి సినిమాకు తారాగణం, సాంకేతిక వర్గం, పాటల వివరాలు, మరీ మైల్‌స్టోన్ సినిమా ఐతే దర్శకులతో చిన్నపాటి బ్లర్బ్‌లు, అలాగే సినిమా సక్సెస్ వివరాలు బానే పొందుపరిచారు. ఈ పుస్తకానికి చదివింపగుణమూ ఉంది. కాని ఈ పుస్తకంలో సోల్ లేదు.
ఇలాంతి పుస్తకం రాయడానికి రచయితకు కనీసం మూడు అర్హతలు ఉండాలని నా అభిప్రాయం. 1) సినిమాలని ప్రేమించి, ఆరాధించాలి2) సినిమా సాంకేతికత గురించి కాస్తో కూస్తో తెలిసుండాలి3) రాసే భాషలో మంచి పట్టుండి, ఆకట్టుకొనే వచనం రాయగలగాలి..
పులగం చిన్నారయణకి మొదటి రెందున్నాయో లేవో కానీ, మూడవదైతే ఖచ్చితంగా లేదు. ఉదాహరణకు తెలుగువెలుగులు లాంటి వ్యాససమహారాన్ని, ఏదో పీ.ఎచ్.డీ ప్రాజెక్టుకు రాసినట్టు రాస్తే ఎలా ఉండేదో ఊహించుకోండి. అదే రమణ, పిలకా గణపతి లాంటి దిగ్గజాలు రాస్తే ఎలా వచ్చింది చూడండి. అదీ సంగతి.
ఈ పుస్తకం గురించి నాకో మేజర్ కంప్లైంటు. వెల. రెండు వందల డెబ్భయ్యైదు రూపాయలుట. అసలు ఈ పుస్తకానికి టార్గెట్ ఆదియెన్స్ ఎవరు? ఎన్నారైలైతే పర్వాలేదు. సగటు ఆంధ్ర జీవులైతే మాత్రం ఈ పుస్తకాన్ని కొనడానికి అన్నేసి డబ్బులు దండగ అనే చెబుతాను. కోతికొమ్మచ్చి లాంటి హాట్ కేకు పుస్తకాలు (మంచి ప్రింటు క్వాలిటీతో) నూట ఏభై రూపాయల్లో దొరుకుతుంటే ఏంటట వీరి గొప్ప. ఇంతేసి ధరలు పెట్టి మళ్ళీ ఆంధ్రలో పుస్తకాలు కొనట్లేదు కొనట్లేదు అనడం మాత్రం రచయితకు తగదు.
ఇట్లు మీ....

Tuesday, August 04, 2009

రాఖీ పండగ

రాఖీ పండగ వస్తుందంటే బోల్డన్ని జ్ఞాపకాలు ముసురుకొస్తాయి. మేమ్ముగ్గురం అబ్బాయిలమైనా నాకు అక్షరాల ఇరవయ్యైదు మంది ఫస్ట్ కజిన్స్. సో, బానే రాఖీలు వచ్చేవి పోస్టులో. ఇవి గాక, ఇరుగుపొరుగు అక్కలు చెల్లెళ్ళు కలుపుకొని అధమ పక్షం డజన్ రాఖీలు కట్టుకొనేవాణ్ణి. చిన్నప్పుడు హాస్టల్లో ఐతే ఇంకా సరదాగా ఉండేది. అందరికి ఒకటీ రెండు రాఖీలుంటే నా దగ్గిర డజను. ఇప్పుడు కజిన్‌స్ అందరూ పెద్దవడం, పెళ్ళిళ్ళు చేసుకొని చెల్లా చెదురవడం, కారణాలేవైతేనేం.. సంఖ్య తగ్గి పోయింది.
ఎవరు పంపినా పంపకపోయినా నాకు తప్పకుండ వచ్చేదీ, నేనూ పని గట్టుకొని ఎదురు చూసేదీ పెద్దక్క (పెద్దనాన్న కూతురు) రాఖీ. పెద్దక్క రాఖీ చాలా స్పెషలు. ఠంచను గా వస్తుంది. చివరిదాకా ఎదురుచూసేలా చేయదు. ఇవన్నీ కాక రాఖీ తో పాటు ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ మోసుకు వస్తుంది. చాలా చిన్నప్పుడు చాక్లెట్లు, కాస్త పెద్దయ్యాక గ్రీటింగ్ కార్డులు, హాస్టల్లో ఉన్నప్పుడు చాంతాడంత ఉత్తరాలు, తను కాస్త పెద్దయి ఉద్యోగం చేయగానే కొత్త చొక్కాలు... ఇలా సందర్భానుసారంగా ఏవేవో. కొన్నాళ్ళామధ్య అదృష్టం ఎక్కువై ఇద్దరం ఒకే ఊర్లో చదువుకునేవాళ్ళం. అప్పుడు చక్కగా నాన్న ఇచ్చిన డబ్బులతో అందరం ఏ మినర్వాకో, అబిడ్స్ తాజ్ కో వెళ్ళి పావ్ భాజీ, ఛోలే భటూరా తినే వాళ్ళం. ఇదిగో ఇవాళ కొరియర్ వాడు ఫోన్ చేసి, సార్ మీ పాకెట్ ఎట్లాగైనా తీసుకోవాలి రేపే రాఖీ అని ఫోన్ చేస్తే ఇవన్నీ గుర్తొచ్చాయి. వెధవ, స్వీట్ డబ్బా ఉందని ముందే సస్పెన్‌స్ తేల్చేశాడు.
ప్స్: చిన్నక్కా, ఇదంతా ఖోపంగా చదువుతున్నావని తెలుసు. ఏదో నీకు పెళ్ళయాక నువ్వూ పంపించడం మొదలెట్టావ్ కానీ, అప్పటి వరకు పంపిన రాఖీల క్రెడిట్టూ, క్రియేటివిటీ పెద్దక్కకే అని మనిద్దరికి తెలుసు. ఏమంటావ్ :)
అక్కలకు, చెల్లెళ్ళకూ, బ్లాగ్ మిత్రులకూ రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు మీ....

Monday, August 03, 2009

లవ్ ఆజ్ కల్

లవ్ ఆజ్ కల్
నాకసలు హిందీ సినిమా చూడాలంటే ఎక్కడలేని నీరసం వస్తుంది. హాలివుడ్ సినిమాల్లా కథనం ఉండదు, తెలుగు సినిమాల్లా కామెడీ ఉండదు. వెరసి చూడాలని ఆసక్తి ఉండదు. ఏడాది కాలంగా మిత్రులతో చూసి చూసి ఇప్పుడు అవీ అలవాటయ్యాయి. మగధీరకు టికెట్లు ఎలాగూ దొరకవని ఈ సినిమాకు వెళ్ళాం. డైరెక్టర్ ఇదివరకు జబ్ వి మెట్ తీసినతనే.
సినిమా కాస్త నిదానంగా నడుస్తుంది. పూతరేకులంత పలుచని కథాంశం. (wafer thin plot) :). బోరు కొట్టించకుండా సినిమా తీయడం కష్టమే. సినిమాలో రెండు కథలు నడుస్తుంటాయి. ఒకటి నేటి తరానికి సంబంధించిన ప్రేమాయణం. ఒకటి నిన్నటి తరానిది. సినిమాకు సైఫ్ నటనే పెద్ద బలం. గత ఏడేనిమిదేళ్ళుగా సైఫ్ నటనను మలచుకొన్న తీరు అద్భుతం. నిన్నటి తరమంటూ చూపించిన కథ చాలా బాగా తీశారు. సాంకేతికంగా నూటికి నూరు మార్కులు వేయొచ్చు. పాటలు మాత్రం నాకు ఆట్టే నచ్చలేదు. కథ వివరాల్లోకి ఎక్కువగా పోను. మీకు drama genre సినిమాలు నచ్చితే తప్పక చూడండి. థియేటర్‌లో కాకపోయినా...డీవీడీలో మాత్రం ఒకసారి చూడొచ్చు. సైఫ్ నటనకోసమైనా. అలాగే పాత తరం కథలో హీరోయిన్ కోసం ;-)ఓవరాల్, ఈ దర్శకుడినుండి ఇంకొన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు. -బు